గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం…
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని, గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో బుధవారం భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బి.వినోద్కుమార్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని భవన నిర్మాణ సంఘం తీర్మానించడం అభినందనీయమన్నారు. సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేది టిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనన్నారు. పోరాటం చేసింది.. పోరాటం చేయించేది టిఆర్ఎస్యేనని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, సిఎం హోదాలో బిఎస్ఎన్ఎల్ వ్యవహారాన్ని గట్టిగా ప్రస్తావించింది కెసిఆర్ ఒక్కరేనని వినోద్కుమార్ చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఎం కెసిఆర్ దేశవ్యాప్త మద్దతు కూడగడతారన్నారు.
కలిసి వచ్చే సిఎంలతో కేసిఆర్ మాట్లాడతారని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 26న జరిగే సార్వత్రిక సమ్మెకు టిఆర్ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. రైల్వే సంఘాల నేతలతో ఇప్పటికే మాట్లాడామని వినోద్కుమార్ చెప్పారు. హైదరాబాద్లో భవన నిర్మాణ రంగానికి దశాబ్దాల వరకు ఢోకా లేదన్నారు. హైదరాబాద్కు వేరే రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పని చేసుకుంటున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేసే కేంద్ర చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు.