హైదరాబాద్: బైక్లను దొంగతనం చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 30 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్ల విలువ రూ.20,00,000 ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా,రాజాపూర్ మండలం, రాఘవాపూర్ తండాకు చెందిన పట్లవత్ రాజ్కుమార్ కేటరింగ్ పనిచేస్తున్నాడు. మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా, డేగ్లోర్ తానా, వజార్ గ్రామానికి చెందిన ఎస్. రోహిత్ కుమార్ అలియాస్ రోహిత్ మైలార్దేవ్పల్లిలోని బాంబే కాలనీలో ఉంటున్నాడు. సంఘారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం, కాంతి బాబుల్గమ్మకు చెందిన శరణ్య సాగర్ నగరంలోని టిఫిన్ సెంటర్లో పనిచేస్తు ఎన్ఎం గూడ, అత్తాపూర్లో ఉంటున్నాడు. నలుగురు మైనర్ బాలురు ఉన్నారు. ఏడుగురు స్నేహితులు మద్యం, గంజాయి, సిగరేట్లు తదితర వ్యసనాలకు బానిసలుగా మారిన నిందితులు చేస్తున్న పనిలో వస్తున్న డబ్బులు సరిపోవడంలేదు. దీంతో బైక్లను చోరీ చేయడం ప్రారంభించారు.
సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మోటార్ సైకిళ్లను చోరీ చేశారు. వాటిని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి రూ.15,000 నుంచి 30,000 వరకు విక్రయించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు నెలల నుంచి బైక్లు చోరీకి గురవుతున్నాయి. దీనిని సవాల్గా తీసుకున్న పోలీసులు సిసి టివి ఫుటేజ్ను పరిశీలించి నేరస్థుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు రాజు, బాలుడిని రాజేంద్రనగర్, హైదర్గూడలో అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం బయటపడింది. దీంతో మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందిలు జనవరి,2020లో హైదర్గూడ, జనప్రియ వద్ద ఉన్న ఎటిఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించారు. అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఎసిపి అశోక్చక్రవర్తి పర్యేక్షణలో ఇన్స్స్పెక్టర్ సురేష్, డిఐ రాజు, సిబ్బంది దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.