Friday, May 3, 2024

ఛత్తీస్‌గఢ్‌లో స్థానిక బిజెపి నేత హత్య

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : తొలిదశ పోలింగ్‌కు మూడురోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. శనివవారం మావోయిస్టులు బిజెపి నేత రతన్‌దూబేను గొడ్డలితో నరికి చంపారు. దూబే నారాయణ్‌పూర్ బిజెపి జిల్లా విభాగం అధ్యక్షులుగా ఉన్నారు. బిజెపి కోసం ప్రచారం సాగిస్తూ ఉండగా హఠాత్తుగా నక్సల్స్ వచ్చి కౌశయినర్ ప్రాంతంలో దాడికి దిగారు. దూబే ఈ ప్రాంత జిల్లా పరిషత్ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికలు బహిష్కరించాలని రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలలో, తండాలలో నక్సలైట్లు కరపత్రాల ద్వారా, పోస్టర్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే వీటిని పట్టించుకోకుండా బిజెపి గెలుపు కోసం దూబే తన బృందంతో ప్రచారానికి వెళ్లారు.

అదునుచూసుకుని ఆయనపై గొడ్డలితో దాడికి దిగిన నక్సలైట్లు ఆయనను జనం చూస్తూ ఉండగానే నరికివేయడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల పోలింగ్‌కు ముందు జరిగిన ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గింది. ఓ పోలీసు బృందం హుటాహుటిన ఈ ప్రాంతానికి వెళ్లినట్లు సీనియర్ అధికారి ఒక్కరు తెలిపారు. రాష్ట్రంలో రెండు విడతలలో పోలింగ్ జరుగుతుంది. తొలి దశ పోలింగ్ ఈ నెల 7వ తేదీన తరువాతి దశ పోలింగ్ 17వ తేదీన నిర్వహిస్తారు. ఇప్పుడు బిజెపి స్థానిక నేత హత్య జరిగిన నారాయణ్‌పూర్ తొలి విడత పోలింగ్ జరిగే 20 స్థానాలలో ఒక్కటిగా ఉంది. దీనికి ప్రచార గడువు ఆదివారంతో ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News