నేటి నుంచి అంబర్ లిస్టులోకి ఇండియా
లండన్: భారత్పై బ్రిటన్ ప్రయాణ ఆంక్షలు మరింతగా సడలించారు. ఆదివారం నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంతో ఇండియా నుంచి బ్రిటన్కు వెళ్లే ప్రయాణికులు నేరుగా ఇంటికి వెళ్లి క్వారంటైన్లో గడిపితే సరిపోతుంది. ప్రస్తుత కోవిడ్ దశలో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై బ్రిటన్ ప్రభుత్వం సిగ్నలింగ్ వ్యవస్థను ఖరారు చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ రెడ్ జాబితాలో ఉన్న ఇండియాను ఇక నుంచి అంబర్ లిస్టులోకి మార్చడం జరిగింది. దీనితో ఇండియా నుంచి బ్రిటన్కు చేరుకునే భారతీయ ప్రయాణికులు ఇప్పటివరకూ ఉన్న పది రోజుల ఖచ్చితమైన, తప్పనిసరి పది రోజుల హోటల్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు.
వారు తమ లగేజీతో నేరుగా ఇళ్లకు లేదా తమ నివాసాలకు వెళ్లవచ్చు. అయితే అక్కడ పదిరోజుల పాటు బయటకు రాకుండా గడపాల్సి ఉంటుంది. ఇండియాను రెడ్ లిస్టు నుంచి అంబర్ లిస్టుకు మార్చే ఉత్తర్వులు ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 4 గంటలకు అమలులోకి వచ్చాయి. కోవిడ్ కేసుల సంఖ్య వ్యాక్సినేషన్ల లెక్కలను చూసుకుని వివిధ దేశాల ప్రయాణికులకు బ్రిటన్ పౌరవిమానయాన సంస్థ లిస్టులు ఖరారు చేసింది. ఇప్పటివరకూ ఉన్న రెడ్ లిస్టు పరిస్థితితో బ్రిటన్ ప్రయాణానికి వెళ్లే ప్రతి భారతీయుడు పదిరోజుల హోటల్ బస ఓసం అదనంగా 1,750 పౌండ్లు వెచ్చించాల్సి వచ్చేది.