హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు, కొత్త ప్రభుత్వ ప్రకటనలపై నివేదిక పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ విభాగాలను కోరింది. ఈసారి వాస్తవ అంచనాల మేరకే బడ్జెట్ ప్రతిపాదనలు ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె జోషి అన్ని శాఖలను ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా కేవలం ప్రభుత్వ ప్రాధాన్యత ఉన్న పథకాలకే నిధుల ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 10 వేల కోట్లు వరకు మాత్రమే ఈసారి అధికంగా రాష్ట్ర బడ్జెట్ ఉండేలా అంచనాలు సిద్ధమవుతున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారిక ఒకరు మన తెలంగాణకు తెలిపారు.
ఆర్థిక మాంద్యం ప్రభావం కొనసాగుతుండటం, కేంద్రం నుంచి నిధులు, గ్రాంట్లు పెద్దగా రాకపోవడంతో బడ్జెట్ అంచనాలు జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి సిఎస్ ఎస్.కె జోషి శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదలనపై సమీక్షిస్తున్నారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్థక, విద్యా శాఖలు ఈ నెల 23న, శుక్రవారం ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, గృహ, దేవాదాయ శాఖల ప్రతిపాదనలపై చర్చించారు. శనివారం హోంశాఖ, రెవిన్యూ, హోం, పౌర సరఫరాల శాఖ, ప్లానింగ్, రవాణా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇవ్వనున్నారు. వీటన్నింటిపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, సిఎస్, సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా సమావేశమై బడ్జెట్ అంచనాలను ఫైనల్ చేయనున్నారు.