న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం సూచించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆర్థిక విషయాలపై విస్తృతమైన, గుణదాయకమైన చర్చ జరగాలని ప్రధాని కోరారు. ‘ఈ సమావేశాల్లో మనం ఈ దశాబ్దానికి బలమైన పునాది వేయాలని సంకల్పించాలి. దళితులకు సాధికారత, మహిళలు, అణగారిన వర్గాలు.
మహిళలకు ప్రాధాన్యత వంటి విషయాలపట్ల మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ దశాబ్దంలో కూడా వారికోసం మా కార్యసాధనను కొనసాగిస్తాం’ అని మోడీ పేర్కొన్నారు. ‘మన ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుచుకోవడమే మన లక్షం. అందుకు ప్రపంచ పరిస్థితిని అవకాశంగా తీసుకోవాలి. సమావేశాల్లో రోజులు గడిచేకొద్దీ చర్చల్లో నాణ్యత పెరుగుతుందని ఆశిస్తున్నాను’ అని నరేంద్రమోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారంనాడు పార్లమెంటుకు బడ్జెట్ సమర్పిస్తారు. ఆమె బడ్జెట్ సమర్పించడం ఇది రెండోసారి. బడ్జెట్ సమావేశాల తొలి దశ ఫిబ్రవరి 11తో ముగుస్తుంది. మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 3 వరకు కొనసాగుతాయి.
budget session 2020