Saturday, April 27, 2024

లాభసాటిగా గుడుల వ్యాపారం!

- Advertisement -
- Advertisement -

ఒక దేశంలో మెజారిటీ మతం మరొక చోట మైనారిటీగా ఉండవచ్చు. మన దేశంలో హిందూ అని పిలుస్తున్న మతంలో వివిధ శాఖలు ఉన్నట్లుగానే క్రైస్తవం, ఇస్లాం, ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. తమ దేశంలోని 75 వేల మసీదుల్లో 50 వేలను మూసివేసినట్లు ఇరాన్ మౌలానా మహమ్మద్ అబోలఘాసివ్‌ దౌలబీ జూన్ ఒకటిన చెప్పాడు. మసీదులకు వచ్చేవారు గణనీయంగా తగ్గటమే దీనికి కారణం అన్నాడు. ఇతగాడు ప్రభుత్వం మత సంస్థల సమన్వయకర్తలలో ఒకడు. దీని గురించి హిందూత్వకు పక్కాగా మద్దతు పలికే, ముస్లింల మీద విద్వేషాన్ని వెదజల్లుతుందనే విమర్శ ఉన్న ఓపి ఇండియా వెబ్ పోర్టల్ రాసింది. ఇస్లామిక్ విశ్వాసాలతో ఛాందసవాదుల హవా నడుస్తున్న చోట ఇలాంటి పరిణామం మన దేశాన్ని హిందూ ఛాందసవాదం, మనువాద హిందూత్వం వైపు తీసుకుపోవాలని చూస్తున్న శక్తులకు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పవచ్చు.

హిజాబ్ వ్యతిరేక ఆందోళనకు దిగిన ఇరాన్ మహిళలకు ప్రపంచమంతా జేజేలు పలికింది. అదే తీరున మన దేశంలో కూడా మత ఛాందసులు, మతోన్మాదుల అజెండా మేరకు సమాజాన్ని నడిపితే ఇక్కడ కూడా వ్యతిరేకత వెల్లడైతే హిందూత్వ అజెండా కుప్పకూలుతుందన్న భయం ఆ శక్తులకు కలగటం సహజం. ఇరాన్ మత శక్తులు పౌరుల జీవితా మీద మతాన్ని రుద్దటాన్ని అక్కడి సమాజం తిరస్కరించటం నానాటికీ పెరుగుతోంది. శిక్షించటాన్ని సహించటం లేదు. ‘సమాజంలోని బలమైన మత భావనలు అంతరిస్తున్నాయి. మతం ఇచ్చే దాన్ని జనం చూస్తారు, మతం పేరుతో జనాలను అవమానించటం, మత బోధనలు, భావనల పేరుతో మతపరమైన కల్పనలతో సహా అనేక కారణాలు, ఇంకా మతం పేరుతో పౌరులకు గౌరవప్రదమైన జీవితాన్ని నిరాకరించటం,

వారిని దారిద్య్రంలో నెట్టడం వంటి అంశాలను బట్టి ఆ మతంలో చేరాలా లేక దాన్ని వదలి వెళ్లాలా అని నిర్ణయించుకుంటారు’ అని కూడా మౌలానా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హిజాబ్‌ను సరిగా ధరించలేదనే కారణంతో నైతికపోలీసులు గతేడాది సెప్టెంబరులో మహసా అమిని అనే యువతిని దారుణంగా కొట్టి చంపటంతో పెద్ద ఎత్తున ఇరాన్‌లో నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రార్ధనలకు వచ్చేవారు లేక 60% మసీదులను మూసినట్లు వార్తలు వచ్చాయి.లవ్ జిహాద్, లాండ్ జిహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా పురోలా పట్టణంలో ఉన్న ముస్లింలందరూ వెళ్లిపోవాలంటూ హిందూత్వ పేరుతో ఉన్న శక్తులు జూన్ 15వ తేదీ గడువు నిర్ణయించి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. హిందువుల్లో ఒక కులం వారు మరొక కులం వారిని వివాహం చేసుకోకూడదంటూ ఉత్తరాది రాష్ట్రాలలో తీర్పులు చెప్పే పంచాయత్‌లను చూస్తున్నాము. ఇది వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవటం తప్ప వేరు కాదు. ఇదే పని ఇతర మత ఛాందసులు చేసినా అదే అవుతుంది.

రెచ్చిపోతున్న మత శక్తులను చూస్తే మన దేశం కూడా ఈ రోజుగాకపోతే రేపు మరో ఇరాన్ అవుతుంది. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు తమ దేశంలో బౌద్ధం అంతరించటానికి కారకులవుతున్నారంటూ శ్రీలంకలోని బౌద్ధ మత ఛాందసులు రెచ్చిపోతున్నారు. రెచ్చగొట్టి దాడులకు పాల్పడేందుకు చూస్తున్నారు. మతంతో నిమిత్తం లేని వారు అమెరికాలో పెరుగుతున్న కారణంగా ప్రతి ఏటా అనేక చర్చ్‌లు మూతపడుతున్నట్లు వార్తలు. చర్చ్ ప్రాంగణాలను కొనుగోలు చేసే వారికి భలే మంచి చౌకబేరం అన్నట్లుగా ఉంది. 2019లో నాలుగున్నర వేల ప్రొటెస్టెంట్ చర్చ్‌లు మూతపడితే, గతేడాది మూడువేల కొత్త చర్చ్‌లు ప్రారంభమైనట్లు వార్తలు. మొత్తం మీద జనాలు చర్చ్‌లకు రాకపోవటం తాత్కాలికమా లేక అదే ధోరణి ముందు కూడా కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గడచిన మూడు సంవత్సరాల ధోరణులను చూసినపుడు మూసివేతలకే ఎక్కువ అవకాశాలున్నట్లు కొందరు భావిస్తున్నారు.

కరోనా తరువాత చర్చ్‌లకు వస్తున్నవారిని చూస్తే అంతకు ముందువచ్చే వారిలో 85శాతమే ఉన్నట్లు ప్రొటెస్టెంట్ పాస్టర్లు నివేదించారట. కరోనాకు ముందు ఏడాదికి కనీసం ఒకసారి చర్చ్‌కు వచ్చినవారు 75 శాతం ఉంటే గతేడాది 67కు తగ్గారు. కుర్రకారు హైస్కూలు చదువులో ఉండగా కనీసం ఒక ఏడాది పాటు చర్చ్‌కు ప్రతి వారం వచ్చేవారని 2017 వివరాలు వెల్లడించగా, ఇప్పడు ప్రతి పది మందిలో ఏడుగురు రావటం లేదని లైఫ్‌వే పరిశోధనలో తేలింది. మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని పెంచుతున్నవారు పెరగటం దీనికి ఒక కారణం అంటున్నారు. పూ సంస్థ విశ్లేషకులు చెప్పినదాని ప్రకారం 1972లో 92% మంది అమెరికన్లు క్రైస్తవులుగా చెప్పుకోగా, 2070 నాటికి 50 శాతం లోపుకి పడిపోవచ్చట. ఇప్పుడున్న వారిలో తాతలు ప్రతివారం చర్చ్‌కు వెళ్లి ఉంటారని, వారి పిల్లలు తమకు దేవుడు అంటే విశ్వాసం అని చెప్పారు తప్ప ప్రతివారం విధిగా చర్చ్‌కు వెళ్లలేదని, మిలీయన్ మనవల దగ్గరకు వచ్చే సరికి చర్చికి వెళ్లే సంబంధాలు గానీ, మతంతో గానీ అనుభవం తక్కువని కొందరు విశ్లేషకులు చెప్పారు.

కాథలిక్ చర్చ్‌లో సెక్స్ కుంభకోణాల కారణంగా జనాలు చర్చ్‌లకు దూరంగా ఉంటున్నారని, దానికి కరోనా కూడా తోడైందని కూడా తేలింది. కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఇలాంటి పరిణామం ముందే జరిగిందని, అమెరికాలో మెల్లగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి సోషలిస్టు దేశాలతో అమెరికా జరిపిన ప్రచ్ఛన్న యుద్ధం కారణమని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. క్రైస్తవ అమెరికా దేవుడు లేని కమ్యూనిజం మధ్య పోరు జరుగుతోందని, మతంలేని వారు అసలు అమెరికన్లే కాదని రెచ్చగొట్టారు. (ఇప్పుడు మన దేశంలో ఎవరైనా బిజెపి, సంఘ పరివార్, హిందూత్వ సంస్థలను లేదా మతంలోని అవలక్షణాలను, మూఢవిశ్వాసాలను ఎవరైనా విమర్శిస్తే లేదా వారితో ఏకీభవించకపోతే మీరు హిందువులే కాదంటూ రెచ్చగొడుతున్న తీరు చూస్తున్నదే).

మూడు దశాబ్దాల క్రితం ప్రచ్ఛన్న పోరులో గెలిచినట్లు అమెరికా ప్రకటించిన తరువాత వారి దగ్గర కమ్యూనిజం గురించి చెప్పటానికేమీ లేదు.అందువలన యువతలో ఒక్క మతం గురించే కాదు, సోషలిజం, పెట్టుబడిదారీ విధానం గురించి కూడా మథనం ప్రారంభమైంది. చివరకు అది ఇప్పుడు సోషలిస్టు వైఫల్యం గురించిగాక తాము ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ దివాలాకోరుతనం గురించి మాట్లాడేందుకు దారి తీసింది. అమెరికా చర్చ్ ఆస్తుల లావాదేవీల్లో అగ్రగామి సంస్థగా ఉన్న ఎడి ఎడ్వైజర్స్ ఎండి బ్రెయిన్ డోల్‌హైడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో విక్రయాలు పెరిగినట్లు చెప్పాడు.కొన్నింటిని గృహాలుగా, కొన్నింటిని సంరక్షణ కేంద్రాలుగా మార్చగా, కొన్ని చర్చ్‌లు విస్తరణలో భాగంగా కొనుగోలు చేసినట్లు చెప్పాడు.
వయసులో దేవుడు, మతం గురించి పెద్దగా పట్టించుకోని అనేక మంది ముసలితనం వచ్చేసరికి పక్కా భక్తులుగా, ఛాందస్థులుగా కూడా మారుతున్నవారిని చూస్తున్నాం.

ఇది ఒక్క మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి వైఖరే ఉంది. చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ఐరోపా దేశాల్లో కుర్రకారు కంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. కానీ అక్కడ యువతరంతో పాటు వృద్ధుల్లో కూడా మతం మీద గట్టిగా ఉన్న భావన తగ్గుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. తమ జీవితాల్లో మతం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని భావిస్తున్న వారు కేవలం పదహారు శాతం మందేనని తాజాగా ఒక సర్వేలో తేలింది. పదేండ్ల క్రితం ఇరవై శాతం ఉన్నారు. దేవుడి మీద నమ్మకం లేదంటూనే జ్యోతిషం, క్షుద్ర విద్యల పట్ల సగం మంది అమెరికా మిలీనియల్స్ నమ్మకాలు పెంచుకుంటున్నారని, అదే చైనాలో కేవలం ఎనిమిది శాతమే అని తేలింది. అమెరికాలో ఇలాంటి మానసిక సేవల పరిశ్రమ లావాదేవీల విలువ రెండు వందల కోట్ల డాలర్లకు పెరిగింది. దేవుడి వ్యాపారం దేశమంతటా మంచి వాణిజ్యమని ఒకనాడు బిజెపిలో పని చేసి, కేంద్రంలో ఆర్థిక మంత్రికి సలహాదారు, రచయితగా ఉన్న మోహన్ గురుస్వామి 2021 ఏప్రిల్ 24న డక్కన్ క్రానికల్ పత్రికలో ఒక విశ్లేషణ రాశారు.

వాటి సారాంశం ఇలా ఉంది. రాజకీయాల్లోనే కాదు మతం ఆర్థిక రంగంలో కూడా రోజు రోజుకూ ప్రాధాన్యత పెంచుకుంటోంది. మధ్యప్రాచ్య దేశాల్లో ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు పెరగటంతో పెద్ద ఎత్తున డబ్బు దేశానికి చేరింది. దాంతో అనేక మసీదుల నిర్మాణం జరిగింది. బ్రిటిష్ వారి కాలంలో చర్చ్‌లకు ప్రాధాన్యత ఉన్నందున మంచి ప్రదేశాల్లో అవి వచ్చాయి. మిషనరీల నిధులు ఇప్పటికీ వస్తున్నాయి. మహా చర్చ్‌లు కాకున్నా చిన్న చిన్న వాటిని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. మసీదులు, చర్చ్‌ల నిర్మాణాల మీద నియంత్రణ ఉంది. దానికి స్పందనగా వెలిసిన గుళ్ల విస్తరణ మీద ఎలాంటి అదుపు లేదు. ఇటీవల తెలంగాణను సందర్శించినపుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా రెండు మూడు గుళ్లు కనిపించాయి. ఇది హిందువులకు భిన్నమైన దేవుళ్లను ఎంచుకొనే స్వేచ్చ ఉండి కాదు, భిన్న కులాలు, గోత్రాలకు చెందిన వారు నిర్మించినవీ, పక్క పక్కనే ఉన్నాయి, ఒకరితో ఒకరు పోటీ పడి నిర్మించుతున్నారు.

ఈ అంశంలో చీరలు, నగలు, మిఠాయి దుకాణాలకు వాటికీ పెద్ద తేడా లేదు. అనుమతుల్లేకుండానే అక్రమ ఇసుక తవ్వకం, అనుమతి లేని మద్యం అమ్మకాల మాదిరి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. దేశంలో టూరిజం ద్వారా జిడిపిలో 9.6 శాతం వస్తోంది. దీనిలో స్వదేశీ వాటా 88 శాతం ఉంది. 2019లో విదేశీ యాత్రీకులు తొమ్మిది కోట్ల మంది రాగా, స్వదేశీ 140 కోట్లు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో విదేశీ, స్వదేశీ టూరిస్టులు ఎక్కువ మంది తిరుపతి, మదురై వంటి మతపరమైన కేంద్రాలను సందర్శించారు. మతపరమైన టూరిజం ఇప్పుడు పెద్ద వ్యాపారం, దీన్ని చూసి మనం ఆందోళన చెందాలా ? పూ సంస్థ ప్రపంచ వైఖరుల గురించి చేసిన సర్వేలో గడచిన నాలుగైదు సంవత్సరాలలో 25 శాతానికి పైగా భారతీయులు మరింత మతపరమైన వారిగా మారారు. 2007 15 సంవత్సరాల మధ్య మతపరమైన టూరిజం మీద పెడుతున్న ఖర్చు రెట్టింపైంది. వేగంగా పెరుగుతున్న ఈ వాణిజ్య ధోరణులను చూస్తుంటే ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. పెరుగుతున్న మత ధోరణుల ప్యవసానాలను కూడా చూడాలి.

గుడ్డి విశ్వాసాలు, మూఢ భక్తి, జగడాలమారి మత ధోరణులు పెరుగుతున్నాయి. గుళ్ల నిర్మాణం లాభసాటిగా ఉండటంతో అవాంఛనీయ శక్తులు బహిరంగ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఒకసారి నిర్మించి దేవుడు, దేవతలను ప్రతిష్టించిన తరువాత వాటిని తొలగించలేరు, ట్రాపిక్ సమస్యలను సృష్టిస్తున్నాయి” మోహన గురుస్వామి పరిశీలనే కాదు, ఈ రోజు ఎక్కడ చూసినా పూజలు, భక్తి వేలం వెర్రిగా మారటాన్ని ఎవరైనా చూడవచ్చు. ఇది విద్యావంతులలో మరీ ఎక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News