జగన్మోహన్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు కేబినెట్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయంపై జాతీయ హ్యాండ్బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక నిర్ణయమని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి అధునాతన సౌకర్యాలతో కూడిన స్పోర్ట్ సిటీ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్పోర్ట్ సిటీ ఏర్పాటు కోసం కమిటీని వేసేందుకు అంగీకరించిన సిఎం కెసిఆర్కు జగన్మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కమిటీని వేయడాన్ని ఆయన స్వాగతించారు.
లాకౌడౌన్ ముగిసిన వెంటనే కమిటీ స్పోర్ట్ సిటీ ఏర్పాట్లను ప్రారంభించాలన్నారు. ఇక, కమిటీకి క్రీడా సంఘాలు పూర్తి సహకారం అందించాలన్నారు. అధునాతన సౌకర్యాలతో కూడిన స్పోర్ట్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలువాలని ఆయన కోరారు. కాగా, చాలా ఏళ్లుగా హైదరాబాద్లో ఎటువంటి అంతర్జాతీయ క్రీడలు జరగడం లేదన్నారు. గతంలో వరల్డ్ మిలటరీ గేమ్స్, ఆఫ్రోఆసియా క్రీడల వంటి మెగా టోర్నీలకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయాన్ని జగన్మోహన్ రావు గుర్తు చేశారు. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్లో ప్రపంచ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాలని జగన్మోహన్ రావు సూచించారు.