మన తెలంగాణ/హైదరబాద్: పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్వాడి కేంద్రాలలో, మినీ అంగన్వాడిలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, పిల్లలకు అందించాలన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం నగరంలోని డిఎల్ఎల్ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళా – శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి దివ్యతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఏయే సంస్థలు మూసివేయాలి, వేటిని పనిచేయించాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అంగన్వాడి కేంద్రాలు, మినీ అంగన్వాడి సెలవులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకు పని చేయాలని చెప్పారు. అయితే కరోనా లక్షణాలున్న వారు కేంద్రాలకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి వారిని గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
అంతే కాకుండా గ్రామాల్లోకి విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారి సమాచారం కూడా ఉన్నతాధికారులకు అంగన్వాడి సూపర్ వైజర్లు, టీచర్లు, ఆయాలు అందించాలన్నారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మరింత పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శానిటైజేషన్ చేయాలన్నారు. అనంతరం మహబూబాబాద్, ములుగు, వరంగల్ అర్భన్ కలెక్టర్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మూడు జిల్లాలకు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై గట్టి నిఘా ఉంచి క్వారెంటైన్ చేయాలన్నారు.