బడ్జెట్ అంతరాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి
పార్లమెంట్ చట్టం సవరణ తేనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసిలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర రంగం సిద్ధం చేసుకుంటోంది. దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి (లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో 25 శాతం వాటాను విక్రయించేందుకు కేబినెట్ అనుమతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బడ్జెట్ అంతరాన్ని తగ్గించేందుకు వనరులను అన్వేషించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్ఐసి వాటా విక్రయం కోసం పార్లమెంట్ చట్టం సవరణ తేవాలి. ఎల్ఐసిలో 25 శాతం వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల సమీకరిస్తుంది. అయితే ఈ అమ్మకం ప్రక్రియ అనేక దశల్లో జరుగుతుంది. సమాచారం ప్రకారం, బడ్జెట్ అంతరాన్ని తగ్గించడానికి ఎల్ఐసిలో కొంత వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం పార్లమెంటు చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎల్ఐసిలో 10 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.80 వేల కోట్లను సేకరించే ప్రణాళిక ఉంది. దీని కోసం ఎల్ఐసి ఐపిఒను సిద్ధం చేస్తోంది. ఎల్ఐసి ఐపిఒ సమయం ఇంకా నిర్ణయించలేదు, కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో దీనిని తీసుకురావాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఎల్ఐసి ఐపిఒ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
కరోనా నష్టాన్ని పూడ్చడానికి ప్లాన్
కరోనా మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక నష్టాలను పూడ్చడానికి ఎల్ఐసి వాటా అమ్మకం ప్రభుత్వానికి సహాయపడుతుంది. 2021 మార్చి నాటికి ద్రవ్య లోటును జిడిపిలో 3.5 శాతంగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ కంపెనీల వాటాలను విక్రయించడం ద్వారా మొత్తం రూ.2.10 లక్షల కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.5700 కోట్లను సమీకరించింది. దీనిలో భాగంగానే ఎల్ఐసిలో వాటాలను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎల్ఐసి 34 కోట్లకు పైగా పాలసీలను కలిగి ఉంది. మొత్తం ఆస్తులు రూ.32 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 1.10 లక్షల మంది ఉద్యోగులు, 1.2 మిలియన్ ఏజెంట్లు ఉన్నారు.
2 లక్షల కోట్ల వార్షిక పెట్టుబడి
దేశంలో అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన ఎల్ఐసి ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతోంది. దీనిలో రూ.50- నుంచి 60 వేల కోట్లు స్టాక్మార్కెట్లో, మిగిలినవి డెట్ మార్కెట్లో, ఇతర పెట్టుబడులు చేస్తోంది. ఎల్ఐసి ఐపిఒ కోసం ప్రభుత్వం ఏజెన్సీలను నియమించింది.