అస్వస్థుడైనందుకు రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ లో వాలంటీర్గా పాల్గొన్న తనకు న్యూరలాజికల్, సైకలాజికల్ తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయని, అందుకని రూ.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని చెన్నైకు చెందిన 40 ఏళ్ల వ్యాపార సలహాదారులు ఒకరు వివాదం లేవదీశారు. అంతేకాదు తక్షణం ఆ వ్యాక్సిన్ పరీక్షలు, ఉత్పత్తి, సరఫరా రద్దు చేయాలని న్యాయ విచారణ సంస్థను అభ్యర్థించారు. ఆయన తరఫున న్యాయసంస్థ ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిఇఒ ఆస్ట్రాజెనెకా యుకె , ప్రొఫెసర్ ఆండ్రూపొల్లార్డ్, చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ అండ్ వైస్ఛాన్సలర్ ఆఫ్ శ్రీ రామచంద్ర హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి కు లీగల్ నోటీస్ జారీ చేసింది. న్యాయసంస్థ నవంబర్ 21న ఈ నోటీస్ జారీ చేసింది.
తన కక్షిదారుడు, అతని కుటుంబం ఈ వ్యాక్సిన్ కారణంగా అనేక వ్యతిరేక పరిణామాలకు గురయ్యారని, భవిష్యత్తులో కూడా ఇవి వెంటాడుతుంటాయని అందువల్ల రూ. 5 కోట్ల నష్టపరిహారాన్ని పొందేహక్కు ఆయనకు ఉందని, ఈ నోటీస్ అందుకున్న రెండు వారాల్లో ఆ మొత్తం చెల్లించాలని షరతు విధిస్తూ నోటీస్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ పరీక్షలు, ఉత్పత్తి, సరఫరా ఆపకపోతే సంబంధిత నిర్వాహకులు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని నోటీస్లో హెచ్చరించారు. ఈ బాధితుడు అక్టోబర్ 1న చెన్నై లోని శ్రీరామచంద్ర హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సంస్థలో వ్యాక్సిన్ ట్రయల్ పొందాడు. దీనిపై ఐసిఎంఆర్ ఎపిడెర్మాలజీ అండ్ కమ్యూనికేట్ డిసీజెస్ డివిజన్ అధినేత డాక్టర్ సమీరణ్ పండా వివరణ ఇస్తూ ఈ పరిణామాలపై సమీక్షిస్తామని, కక్షిదారుడు ఈ విషయంలో తొందరపడితే తమ సంస్థకు, ఎథిక్స్ కమిటీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని అభ్యర్థించారు.