Friday, April 26, 2024

అభివృద్ధికి కేంద్రమే ‘ప్రతిబంధకం’

- Advertisement -
- Advertisement -

CM KCR Chair Cabinet Meeting at Pragathi Bhavan

ఎస్‌ఎన్‌ఎ అకౌంట్ల పద్ధతితో నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులపైనా గందరగోళం
 ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆదాయంలో 15.8% కేంద్రం నుంచి రావాల్సిన సిఎస్‌ఎస్
నిధుల్లో 12.9% తగ్గుదల
ఎఫ్‌ఆర్‌బిఎం కోతలు లేకుంటే రాష్ట్ర ఆదాయం 22% పెరిగేది
రాష్ట్ర ప్రగతిని కేంద్రం అందుకొని ఉంటే జిఎస్‌డిపి మరో రూ.3లక్షల కోట్లు పెరిగేది
దేశ జనాభాలో మనం 2 శాతమే, అయినా దేశానికి 5 శాతానికి మించిన ఆదాయం అందిస్తున్నాం
-రాష్ట్ర సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినప్పటికీ ఆదాయంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటును సాధించిందని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సంతృప్తిని వ్యక్తం చేసింది. అదే సమయంలో రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి…ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో ఎస్‌ఎన్‌ఎ అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని మంత్రి వర్గసమావేశం అభిప్రాయపడింది. అంతేకాక ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడం, పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగిందని మండిపడింది.
గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా ఐదున్నర గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల రద్దుతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ సమావేసంలో సమగ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, కేంద్రం ప్రభుత్వం నుంచి సిఎస్‌ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్ 12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.ఎఫ్‌ఆర్‌బిఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్రం యొక్క ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని వ్యాఖ్యానించింది. సిఎస్‌ఎస్‌లో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ. 47,312 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని ఈ సందర్భంగా ఆర్థికశాఖ వివరించింది.
అయితే గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రైతులకు రూ. 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందని ఆర్థికశాఖ అధికారులు క్యాబినెట్ కు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం 1 లక్ష 84 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో సిఎస్‌ఎస్ పథకాల కింద అందింది రూ.5200 కోట్లు మాత్రమే వచ్చిందని స్పష్టం చేసింది. అంటే మొత్తం రాష్ట్రం పెట్టిన ఖర్చులో 3శాతం కంటే తక్కువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయని మంత్రివర్గానికి అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014…20-15లో రాష్ట్రం యొక్క ఆదాయం రూ.62 వేల కోట్లు ఉండగా గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఆర్థిక శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.

కేంద్రం విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి కుంటుపడుతోంది
కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతుందని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే రాష్ట్ర జిఎస్‌డిపిమరో 3 లక్షల కోట్లు పెరిగి ఉండేదని అభిప్రాయపడింది. మొత్తంగా రాష్ట్ర జిఎస్‌డిపి రూ. 14.50 లక్షల కోట్లకు చేరుకునేదని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినప్పటికీ దేశ ఆదాయానికి 5 శాతం మనం కంట్రిబ్యూట్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని అధికారులు కేబినెట్ కు వివరించారు.

కొత్త పెన్షన్లకు గ్రీన్‌సిగ్నల్
కొత్త పెన్షలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మరో 10 లక్షల పెన్షన్లకు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పెన్షన్లను 15వ తేదీ నుంచి మంజూరు చేయాలని తలపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తోంది. ప్రస్తుతం అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్లకు చేరుకోనుంది. వారందరికి కొత్తగా పెన్షన్ కార్డులు కూడా అందజేయనునుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో కార్డుల నమూనాను కూడా ఖరారు చేసింది.
ఇఎన్‌టి, సరోజని ఆసుపత్రులకు మహర్ధశ
ఇఎన్‌టి ఆసుపత్రికి 10 మంది స్పెషలిస్టు డాక్టర్ పోస్టులను రాష్ట్ర మంత్రివర్గం మంజూరు చేసింది. అలాగే ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో ఇఎన్‌టి టవర్ నిర్మించాలని తలపెట్టింది.అలాగే సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
ప్రత్యేక సమావేశాలు రద్దు
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
గ్రామకంఠ సమస్యలకు ప్రత్యేక కమిటీ…15 రోజుల్లో నివేదిక
అలాగే జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆదేశించింది.
తాండూరు మార్కెట్ కమిటీకి 30 ఎకరాల స్థలం కేటాయింపు
తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే షాబాద్ లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టిఎస్ ఐఐసి ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం. వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఐటి శాఖకు ప్రశంసలు
ఐటి రంగంలో గత సంవత్సరం రాష్ట్రంలో 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్‌కు తెలిపారు. ఐటి రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగలూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలు కల్పన చేయగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఐటి అధికారులు వివరించారు. ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతిభద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనుల లభ్యత వల్ల ఐటి రంగంలో అభివృద్ది సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగాఐటి రంగ అభివృద్ధిపై సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటిశాఖ మంత్రి కెటిఆర్, ఐటిశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ఇతర అధికారులను ప్రశంసించారు.

CM KCR Chair Cabinet Meeting at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News