Tuesday, April 30, 2024

జాతీయ వ్యూహంపై పికెతో సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఎపికి చెందిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌తోనూ చర్చలు
జాతీయస్థాయిలో పార్టీ ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నిక వ్యూహంపై మంతనాలు 
మమతా బెనర్జీ 15వ తేదీన ఏర్పాటు చేసిన విపక్షాల ఢిల్లీ భేటీపై చర్చ

ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా సాగిన సమాలోచనలు

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటుపై శరవేగంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానంగా జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత బిజెపి నుంచి ఎదుర్కొనాల్సిన పరిణామాలు, పర్యవసానాలు, రోడ్ మ్యాప్‌పై ప్రశాంత్ కిషోర్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. పార్టీని దేశవ్యాప్తంగా ఎలా విస్తరింప చేయాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ పార్టీ పేరు.. ఎజెండాతో పాటు ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేయాలని అనే అంశాలపై కూడా పికె నుంచి పలు సూచనలు, సలహాలు సిఎం కెసిఆర్ స్వీకరించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్, బిజెపి పాలనను చూసిన దేశ ప్రజలకు మనం పెట్టే జాతీయ పార్టీవైపు అందరి దృష్టిని పడేలా విధివిధానాలను రూపొందించాల్సిన అంశాలపై కూడా చర్చించారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రాల మధ్య తెగని నదీ జాలాల సమస్యతో పాటు ఆర్ధిక అంశాలను పరిష్కరించుకుందుకు త్వరలోనే రిటైర్డు ఎఐఎస్, ఐఎఫ్‌ఎస్‌తో పాటు ఇతర అధికారులతో ఒక సమావేశం నిర్వహించి వారి నుంచి కూడా సూచనలు.. సలహాలు తీసుకుని జాతీయ పార్టీని ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వారితో ఒక సమావేశం నిర్వహించాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తేదీని మరో నాలుగైదు రోజుల్లో ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కూడా పికెతో కెసిఆర్ చర్చించారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చేందుకు అవసరమైన వ్యూహాలపై పలు కోణాల్లో సమాలోనచలు చేసినట్లుగా సమాచారం. బిజెపితో యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతో మొదలుపెట్టాలని కెసిఆర్ ప్రధానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపియేతర పక్షాన ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎవరిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి బలమైన ప్రత్యర్ధిని బరిలోకి దింపడం ద్వారా మోడీ ప్రభుత్వానికి చెమటలు పెట్టాలని భావిస్తున్నారు. పైగా ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధికి వ్యతిరేకంగా పోటీ పెట్టడం వల్ల బిజెపియేతర పార్టీలను మరోసారి ఏకం చేసేందుకు ఉపయోగపడుతుందని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఇదే విషయంపై ప్రశాంత్ కిషోర్‌తో చర్చించి తన వ్యూహాలకు మరింతగా పదునుపెడుతున్నారు. రాష్ట్రాల వారిగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే పార్టీల సంఖ్య ఎంత? వారికున్న ప్రజాప్రతినిధుల బలం ఎంత? తదితర అంశాలపై కూడా వారిద్దరు లెక్కలు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రాన్ని దెబ్బకొట్టి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కెసిఆర్…. ఇందుకు రాష్ట్రపతి ఎన్నికలే సరైన అవకాశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూటికి నూరు శాతం రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి తన సత్తాఏమిటో చూపాలని తహతహలాడుతున్న కెసిఆర్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా పికె కూడా భరోసా తెలిపారని సమాచారం. కాగా పికె మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. మొత్తం మీద రాష్ట్రపతి ఎన్నికలు మరోసారి బిజెపి, బిజెపియేతర పార్టీల శక్తిసామర్ధాలకు అగ్నిపరీక్షగా మారబోతున్నదని తెలుస్తోంది.

ప్రాధాన్యత సంతరించుకున్న భేటి
పికెతో కేవలం వారం రోజుల్లోనే సిఎం కెసిఆర్ రెండు దఫాలుగా భేటి కావడం రాజకీయ వర్గాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సిఎం ఫాంహాజ్‌కు వెళ్లి చర్చలు జరిపిన ఆయన.. ఆదివారం ప్రగతి భవన్‌కు వచ్చి చర్చలు జరిపారు. దీంతో వారిద్దరి భేటీపై దేశవ్యాప్తంగా వాడివేడి చర్చ సాగుతోంది. జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడు ఉండబోతుందన్న అంశంపై సర్వత్రా ఆకస్తి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలో టిఆర్‌ఎస్ ఎప్పట్లాగే కొనసాగుతుందా? లేదా? ఊహాగానాలకు తగ్గట్లుగా జాతీయ పార్టీగా అవతరిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ నెల 19వ తేదీన తలపెట్టిన పార్టీ టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై సిఎం కెసిఆర్ తన తుది నిర్ణయం ప్రకటించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రగతి భవన్‌లో ఈనెల 10వ తేదీన మంత్రులు, ఎంపిలతో పాటు పార్టీ కీలక నేతలతో 6 గంటల పాటు కెసిఆర్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అందులో టిఆర్‌ఎస్ పోషించనున్న పాత్రపై విస్తృతంగా చర్చించారు. దేశంలో మతపరమైన పరిస్థితులు నెలకొన్న వేళ దేశ ప్రజల అవసరాలు ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరంతో పాటు టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చే అంశంపై వారి అభిప్రాయాలు కూడా సేకరించిన విషయం తెలిసిందే.

రాష్ట్రాల వారిగా నేతలకు బాధ్యతలు?
ఒకవైపు జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన అన్ని హంగులపై సిఎం కెసిఆర్ దృష్టి సారిస్తూనే…మరోవైపు రాష్ట్రాల వారిగా ఎవరెవరికి జాతీయ పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. అందుకు గల సమర్ధత గల నేతల జాబితాను రూపొందించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఆయా రాష్ట్ర రాజకీయాల్లో బాగా పట్టున్న నాయకులను గుర్తించి…వారికి కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలను ఆ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి ఉండవల్ల అరుణ్‌కుమార్‌కు అప్పగించానున్నారని ప్రచారం సాగుతోంది. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో జాతీయ పార్టీ అంశంపై చర్చించేందుకే ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లుగా సమాచారం. కొత్త పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే కోణంలో కెసిఆర్ ఆయన అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమతో ఏ పార్టీలు కలిసొచ్చే అవకాశం ఉంటుందనే అంశంపై కూడా ఉండవల్లి సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం. పైగా ఆయనకు అన్ని విషయాలపై పరిజ్ఞానం ఉండడం.. అనేక భాషలపై పట్టు ఉండడం… సీనియర్ రాజకీయ నాయకుడిగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు. కేవలం ఎపి రాష్ట్రమే కాకుండా అవసరమైతే ఢిల్లీలో కూడా ఉండవల్లి సేవలను ఉపయోగించుకోవాలని కెసిఆర్ తలపెట్టారు. అలాగే కర్నాటక రాష్ట్ర బాధ్యతలను ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కట్టబెట్టనున్నారని తెలుస్తోంది. కాగా ఒకటి, రెండు రోజులలో మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల జాబితాను రూపొందించే పనిలో కెసిఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా పలు రాష్ట్రాల్లో బిజెపికి దూరంగా ఉంటున్న రాజకీయ పార్టీలు కెసిఆర్ నేతృత్వంలో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని చూపుతున్నాని తెలుస్తోంది. ఈ మేరకు పలు పార్టీలకు చెందిన నేతల సిఎం కెసిఆర్‌తో ఫోన్‌లో సంప్రదింపులు చేసినట్లుగా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

CM KCR Meeting with PK at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News