Sunday, April 28, 2024

విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం

- Advertisement -
- Advertisement -

భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు రూపొందించాలి

ప్రాణనష్టాలు నివారించాలి
రానున్న 3,4 రోజులు చాలా కీలకం
చెరువుల కట్టలు పటిష్టంగానే ఉన్నాయి
ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి
ట్రాక్ షీట్లు తయారు చేయాలి
వైద్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి
అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు
ఉన్నత స్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్

CM KCR Review meeting on floods and Rains

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు, మరో మూడు నాలుగు రోజుల పా టు భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యం లో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడవద్దని, అవసరమైన నిధు లు సిద్ధంగా ఉన్నాయని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతి రోజు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రకృత వైపరీత్యం తలెత్తినా సరే ఎక్కడా ఏమాత్రం అంతరా యం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, విద్యుత్ డిమాండ్‌లో భారీ వ్యత్యాసం వచ్చినా గ్రిడ్ ఫెయిల్ కాకుండా సమర్థవంతంగా వ్య వహరించిన విద్యుత్ శాఖను, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో పెద్ద కష్టం, భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జల వనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రహదారులు-భవనాలు తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సిఎం కెసిఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరదల ఉధృతి ఎక్కువున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సిఎం ప్రత్యేకంగా సమీక్షించారు.

రానున్న మూడు నాలుగు రోజులు చాలా కీలకం
గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఫలితంగా అన్ని జలాశయాల్లో నీరు వస్తున్నదన్నారు. నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కానీ రాబోయే మూడు నాలుగు రోజులు కూడా చాలా ముఖ్యమని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం, అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నా యని తెలిపారు. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. మరో వైపు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని సిఎం కెసిఆర్ వివరించారు. ఈ కారణాల వల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడి, భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో జరిగే పరిణా మాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం సూచించారు.

చెరువుల కట్టలు పటిష్టంగానే ఉన్నాయి
రాష్ట్రంలో దాదాపు అన్ని చెరువులు నిండి, అలుగు పోస్తున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన ఫలితంగా చెరువు కట్టలు పటిష్టంగా తయారయ్యాయని అన్నారు. గతంలో ఇలాంటి వర్షాలు వస్తే వేల సంఖ్యలో చెరువు కట్టలు తెగేవని.. బుంగలు పడేవని గుర్తు చేశారు. కానీ మిషన్ కాకతీయ వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. అలాగే కట్టలు సైతం చాలా పటిష్టం అయ్యాయని తెలిపారు. మిషన్ కాకతీయలో చేపట్టని కొన్ని చిన్నపాటి కుంటలకు మాత్రమే నష్టం వాటిల్లిందన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున, చెరువులకు వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రతి చెరువునూ నిత్యం గమనిస్తూనే ఉండాలని ఆదేశించారు.

ఎంత విపత్తు వచ్చానా సరే ప్రాణనష్టం జరగొద్దు
ఎంత విపత్తు వచ్చినా సరే ప్రాణనష్టం జరగవద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్ సూచించారు. ఇతరత్రా నష్టాలు సంభవిస్తే ఏదోలా పూడ్చుకునే అవకాశం ఉందని కానీ ప్రాణాలు తిరిగి తేలేమనారు. కాబట్టి విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడడమే అత్యంత ప్రధానమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలన్నారు. దానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు కూడా వాతావరణం బాగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా, ముంపు ప్రమాదం ఉన్నా వెంటనే అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలన్నారు. కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు అని సిఎం కెసిఆర్ అన్నారు. కాజ్ వేల వద్ద వరద నీరు రోడ్లపైకి వస్తున్నదని, అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు నీటి ప్రవాహానికి ఎదురెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దుని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ఏటూరు నాగారం, మంగపేట మండలాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ముంపు గ్రామాలను, ప్రాంతాలను గుర్తించాలన్నారు. తక్షణమే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంగదని, కాబట్టి భద్రాచలం పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అక్కడి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

CM KCR Review meeting on floods and Rains

ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి
నీటి ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఈ శిబిరాల్లో అందరికి కావాల్సిన వసతి, భోజనం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కోవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలన్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడే ఉండి తమ ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పులు అంచనాలు తయారు చేయాలన్నారు. అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు కూడా ప్రతి రోజు ప్రతి పట్టణం, ప్రతి గ్రామం నుంచి తాజా పరిస్థితిపై నివేదిక తెప్పించుకోవాలన్నారు. ఆ నివేదిక కలెక్టర్ల ద్వారా కార్యదర్శికి, అక్కడి నుంచి ప్రధాన కార్యదర్శికి చేరాలన్నారు. దానికి అనుగుణంగా ఎక్కడ ఏది అవసరమో ఆ చర్య తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో ఎక్కడా ఎలాంటి అశ్రద్ధ, జాప్యం జరగవద్దు అని స్పష్టం చేశారు.

శాశ్వత వ్యూహాన్ని రూపొందించాలి
ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన శాశ్వత వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఏ స్థాయిలో వర్షం వస్తే, ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? అప్పుడు ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది? అలా జరిగితే ఏ చర్యలు తీసుకోవాలి? ఎంత వర్షం వచ్చినా సరే ముంపుకు గురికాకుండా లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? ఎక్కడ రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంది? ఎక్కడ కాజ్ వేల మీదుగా నీరు ప్రవహించవచ్చు? రోడ్లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? తదితర అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహం ఖరారు చేయాలన్నారు. అన్ని పట్టణాల్లో మున్సిపల్ శాఖ, పోలీసుతో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా విపత్తు జరిగిన వెంటనే రంగంలోకి దూకే విధంగా వారిని సిద్ధం చేయాలనారు.

ట్రాక్ షీట్లు తాయారు చేయాలి
అన్ని నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్ షీట్ తయారు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువైతే జరిగే పరిణామాలను అంచనా వేయాలన్నారు. గతంలో నదులు పొంగి ప్రవహించినప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తిందో ట్రాక్ రికార్డు ఉండాలని దాని ఆధారంగా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వానలు, వరదలు సంభవిస్తే ఏమి చేయాలనే విషయంలో ఆంధ్రప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వ్యవహరించారన్నారు. దానికి అనుగుణం గానే ప్రణాళికలు, ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. అప్పట్లో తెలంగాణ గురించి ఆనాడు పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా వాటిని పరిగణలోకి కూడా తీసుకోలేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనైనా రాష్ట్ర దక్పథంలో విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని రూపొందించుకోవాలన్నారు. ఇది శాశ్వత ప్రాతిపదికన జరగాలన్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు

వైద్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో సంభవించే అంటు వ్యాధులు, ఇతరత్రా వ్యాధుల విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ సూచించారు. వ్యాధులపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. అన్ని ప్రభుత్వ వైద్య శాలల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఇది కేవలం ఈ ఒక్క సంవత్సరానికే కాకుండా ప్రతి వానాకాలంలో వైద్య పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సరైన వ్యూహం రూపొందించి… అమలు చేయాలన్నారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు
రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూములు 24 గంటల పాటు నిరంతరాయంగా నడవాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వచ్చినా స్వీకరించి, తక్షణం సహాయం అందించాలన్నారు. కంట్రోల్ రూముల్లో రెవెన్యూ, పోలీస్, జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ తదితర ముఖ్యమైన శాఖల ప్రతినిధులుండాలని సిఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కె.టి రామారావు, నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ట్రాన్స్ కో – జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు,సిఎంవో ముఖ్యకారదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, డిజిపి మహేందర్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చారి, జి.ఎ.డి కార్యదర్శి వికాస్ రాజ్, మునిసిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పంచాయతిరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జలవనరుల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, పంచాయతి రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జిహెచ్ ఎంసి కమిషనర్ లోకేశ్, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఇఎస్ సి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

CM KCR Review meeting on floods and Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News