Sunday, April 28, 2024

యుద్ధప్రాతిపదికన సహాయం

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం

ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ
అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ
కొంత ఇబ్బంది కలిగినా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు
చెరువులు, ఎఫ్‌టిఎల్ పరిధిలోని కాలనీలే జలమయమయ్యాయి
అపార్టుమెంట్‌ల నిర్మాణానికి అనుమతులిచ్చే సమయంలో
సెల్లార్లలో వరదనీరు నిలవకుండా నిబంధన విధించాలి
హైటెన్షన్ విద్యుత్ వైర్ల తొలగింపునకు కార్యాచరణ : సిఎం కెసిఆర్

CM KCR Review on Crops at Pragathi Bhavan

మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులు, భోజనం, ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్‌ఎంసికి రూ.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని సిఎం స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సిఎం చెప్పారు. నీళ్లుండగానే విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదం కనుక, ఒకటి, రెండు రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణనష్టం కలగకుండా ఉండేందుకు నీళ్లు పూర్తిగా తొలగిన తర్వాతనే విద్యుత్ సరఫరా చేయాలని సిఎం ఆదేశిచారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే, చాలా చోట్ల చెరువుల ఎఫ్‌టిఎల్ పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని సిఎం చెప్పారు. అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిఎం వెల్లడించారు. అపార్టుమెంటు సెల్లార్లలో నీళ్లు నిల్వకుండా ఉండే ఏర్పాటు నిర్మాణ సమయంలోనే చేసి ఉండాల్సిందని సిఎం చెప్పారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని సిఎం ఆదేశించారు. కాలనీలు, అపార్టుమెంట్లలో నిలిచిన నీల్లను తొలగించడానికి మెట్రో వాటర్ వర్క్, ఫైర్ సర్వీస్ సేవలను వినియోగించుకోవాలని సిఎం సూచించారు. ఇండ్లపై హై టెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సిఎం ఆదేశించారు.
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను సిఎం నిర్ధేశించారు. హైదరాబాద్‌లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జిహెచ్‌ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు కెటి రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిహెచ్‌ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జల వనరుల శాఖ ఇఎన్‌సి మురళీధర్ రావు, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో వివిధ శాఖల వారిగా జరిగిన నష్టం వివరాలను సిఎంకు అధికారులు వివరించారు.

వ్యవసాయ శాఖకు రూ.2వేల కోట్ల నష్టం
అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో సగం పంటలకు నష్టం కలిగినా వాటి విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని అధికారులు వివరించారు.

నగరంలో వరద నీటిలో చిక్కుకున్న ఇళ్ళ సంఖ్య 20,540
హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయని, 35 వేల కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని సిఎంకు వివరించారు. ప్రధానంగా ఎల్‌బి నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువుందన్నారు. వరద నీటికి హైదారాబాద్ నగరంలో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు పెద్దఎత్తున సహాయ చర్యలు చేపడుతున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 11 మంది ఉన్నారని తెలిపారు. కాగా జిహెచ్‌ఎంసి పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమమన్నారు. దీనివల్ల చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని వివరించారు. ముఖ్యంగా చెరువుల ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న కాలనీల్లో పెద్ద ఎత్తున నీరు చేరిందన్నారు. అపార్టుమెంట్ల సెల్లార్లలో కూడా నీరు రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని సిఎంకు తెలియజేశారు. అలాగే గ్రేటర్ పరిధిలో మొత్తం 445 చోట్ల బిటి రోడ్లు, 6 చోట్ల నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని వివరించారు. అన్ని చోట్ల రోడ్ల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి, ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించడం జరిగింది. ఇండ్లలో నీళ్లు చేరినందున రోజు దాదాపు లక్షా పది వేల మందికి భోజనం అందిస్తున్నామని వివరించారు. జిహెచ్‌ఎంసితో పాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉందన్నారు. 238 కాలనీలు జలమయమయ్యాయి. 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్లు, ఎస్‌పిడిసిఎల్ పరిధిలో 15 సబ్ స్టేషన్లు, ఎన్పీడిసిఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చాయన్నారు. అన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన నీళ్లను తొలగించడం జరిగిందని, లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లలో నీళ్లున్న అపార్టు మెంట్లకు విద్యుత్ సరఫరా తొలగించడం జరిగిందన్నారు. నీళ్లు తొలగించే పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నీళ్ల తొలగింపు పూర్తయిన చోటల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతున్నదని. చెట్లు, కొమ్మలు పడిపోయిన చోట్ల వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరణ జరిగిందని వెల్లడించారు.

విద్యుత్ శాఖ రూ. 5 కోట్ల నష్టం
చాలా చోట్ల వరదల వల్ల, ముఖ్యంగా మూసీ నదీ వెంట ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు, కరెంటు పోళ్లు కొట్టుకుపోయాయని సిఎం కెసిఆర్ సంబంధిత అధికారులు వివరించారు. విద్యుత్ శాఖ పరంగా దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు.

జలవనరుల శాఖకు రూ.50 కోట్ల నష్టం
రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగగా, 26 చెరువు కట్టలకు బుంగలు పడ్డాయని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జల వనరుల శాఖకు మొత్తంగా రూ.50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు.

పంచాయతీ రాజ్‌కు రూ.295 కోట్ల నష్టం
వరదల కారణంగా రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయన్నారు. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. సుమారు రూ.295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. అలాగే ఆర్ అండ్ బి రోడ్లు 113 చోట్ల దెబ్బతినగా, ఆ శాఖకు ధిలో రూ.184 కోట్లు, నేషనల్ హైవేస్ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు సిఎం కెసిఆర్‌కు వివరించారు.

CM KCR Review on Floods in State at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News