Monday, May 6, 2024

వరికి గడ్డుకాలం

- Advertisement -
- Advertisement -

CM KCR review on Grain purchases and cultivation

ఒక్క కిలో బాయిల్డ్ రైస్‌నూ కొనలేమని చెప్పిన కేంద్రం
రాష్ట్రంలో ఆ మిల్లులు మూతపడే ప్రమాదం

వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వకుండా, ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయంటూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కేంద్రం, ఈ వర్షాకాలంలో 60లక్షల టన్నుల మేరకు మాత్రమే ఐకెపిల ద్వారా ధాన్య సేకరణ, యాసంగిలో ప్రతామ్నాయ పంటలు పండిస్తేనే రైతులకు లాభాలు, ఆ వైపుగా రైతులను చైతన్యపరిచేందుకు వ్యవసాయ శాఖ ప్రచారం చేయాలి ప్రగతిభవన్‌లో సిఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో అధికారులు వెలిబుచ్చిన అభిప్రాయాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం ఒక్క కిలో బాయిల్ రైస్ కూడా కొనలేమని చెప్పడం వల్ల రాష్ట్రంలోని బాయిల్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీని కారణంగా రాష్ట్రంలో రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు మాట్లాడుతూ.. గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్‌సిఐ ద్వారా త్వరగా తీసుకోవాలని, తద్వారా వానాకాలంలో ఉత్పత్తి అయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని పేర్కొంటూ ఇటీవల కేంద్ర పౌరసరపరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కెటిఆర్‌లు కలిసి విన్నవించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఒక్కకిలో బాయిల్ రైస్ కూడా కొనలేమని ఇప్పటికే కేంద్రం వద్ద 5 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్నాయని కేంద్రమంత్రి తేల్చిచెప్పిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుత వానాకాలంలో కూడా 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోనని కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని అధికారులు సమావేశంలో తెలిపారు. దేశంలో కరువులు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ప్రజల అవసరాల దృష్ట్యా ధాన్యం నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ విధి అని కెసిఆర్ వద్ద ప్రస్తావించారు. రాష్ట్రాలు తమకు పంటలను కనీస మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం వరకే రాష్ట్రాల బాధ్యత అని అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అయితే కేంద్రమంత్రి గోయల్ మాత్రం ఇప్పటికే నిల్వలు ఉన్న దృష్ట్యా ఒక్క కిలో ధాన్యం కూడా కొనలేమని చెబుతున్నారని అధికారులు వివరించారు.

రాష్ట్రంలో కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా రైతు బంధు వంటి పంట పెట్టుబడి సాయం, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి ప్రోత్సాహకాల ద్వారా సాగు గణనీయంగా పెరిగి, రైతులు పంటలు బాగా పండిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి వ్యవసాయ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సహిస్తే బాగుండేదన్నారు. కానీ కేంద్రం ఇలాంటివేమీ చేయకపోవడం వల్ల ఆహార నిల్వలు పేరుకు పోతున్నాయని చెప్పి తన బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోచూస్తున్నదని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాయిల్ రైస్ కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన దరిమిలా ఇక వచ్చే యాసంగి కాలం నుండి వరి వేయడమంటే రైతులు ఉరి వేసుకోవడమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని, రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేస్తున్నారని,

దీని ద్వారా సుమారు 1 కోటి 40 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉందని అధికారులు వివరించారు. వీటి దృష్ట్యా పిడిఎస్ తదితర అవసరాల మేరకు కేంద్రప్రభుత్వం నిర్ధారించిన కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వివరించారు. వీటన్నింటి దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.

గతంలో కరోనా వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. కానీ, ఈ వర్షాకాలంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను ఐకెపికేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం సేకరణ జరగాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్ని స్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News