Sunday, April 28, 2024

నో లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రణాళికా సంఘం ఉపాధక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సిఎంవో కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హైల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఇ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సిఎం సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సీజన్ అందుతున్నది ఇంకా ఎంతకావాలి..? వాక్సిన్‌లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి రోజుకు ఎంత అవసరం..? రెమిడిసివర్ మందు ఏ మేరకు సప్లయి జరుగుతున్నది..? రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను, ఆక్సీజన్ బెడ్ల లభ్యత వంటి విషయాల మీద పూర్తిస్థాయిలో చర్చించారు. రెమిడిసివర్ తయారీ సంస్థలతో సిఎం కెసిఆర్ ఫోన్లో మాట్లాడి వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు.
వారంలో ఆక్సిజన్ బెడ్లను 5 వేలకు పెంచాలి
రాష్ట్రంలో ఇప్పటివరకు 9,500 ఆక్సీజన్ బెడ్లు వున్నాయని వాటిని హైదరాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000కు పెంచాలని సిఎం అధికారులను ఆదేశించారు. మెరుగైన ఆక్సీజన్ సరఫరా కోసం ఒక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని ముఖ్యమంత్ర సిఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హాస్పటల్స్, ఏరియా ఆస్పిటల్స్‌లలో మొత్తం 5,980 కొవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
పబ్లిక్ డొమెయిన్‌లో కొవిడ్ రోగులు, కోలుకున్న వారి వివరాలు
సెకండ్ వేవ్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి లక్షాయాభైయారు వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పయివేలు (85 శాతం) కోలుకున్నారని అధికారులు సిఎంకు వివరించారు. రోజువారీగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సిఎం తెలిపారు. దీనికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి పాజిటివ్ కేసుల వివరాలు, కోలుకున్న వారి వివరాలు, హోం క్వారెంటైన్‌లో ఎంతమంది వున్నారు, ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ప్రైవేట్ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్ డోమైన్‌లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని సిఎం తెలిపారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలపి పేర్కొన్నారు.
మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి
మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవాళ్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సిఎం ఆదేశించారు. ఆక్సీజన్ సరఫరా గురించి సమీక్షించిన సిఎం రాష్ట్రంలో ఆక్సీజన్ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఐఐసిటి డైరక్టర్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సీజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సిఎం ఆరా తీశారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సీజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సీజన్ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని సిఎం కెసిఆర్ అన్నారు.
ప్రజలకు ఇంటికే కొవిడ్ మెడికల్ కిట్లు :
కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సిఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కొవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని అన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంల ద్వారా ఇంటింటికీ అందచేస్తామని చెప్పారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

CM KCR Review with Officials on Corona situation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News