Wednesday, May 8, 2024

తెలంగాణ ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) 2023 -24 నాటికి అదనంగా మరో 10,000 మంది కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్య శాఖతో తమ అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు, హెచ్‌సిసిబి మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసి 2022లో తమ భాగస్వామ్య మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 10196 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి, సిహెచ్ మల్లారెడ్డి, సమక్షంలో హెచ్‌సిసిబి, తెలంగాణ ప్రభుత్వం ఈకార్యక్రమాన్నివిస్తరిస్తున్నట్లు ప్రకటించాయి, పరిశ్రమలు & వాణిజ్యం, IT, E&C ప్రిన్సిపల్ సెక్రటరీ, డాక్టర్ జయేష్ రంజన్, IAS, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సీఈఓ శ్రీకాంత్ సిన్హా, హిందూస్థాన్‌ కోకా-కోలా బెవరేజెస్ చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి, హిందూస్థాన్‌ కోకా-కోలా బెవరేజెస్ హెడ్ – హెచ్ ఆర్ శ్రీమతి చిత్ర గుప్తా, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“క్యాంపస్ టు కార్పోరేట్” అని కూడా పిలువబడే ఈ కార్యక్రమం కళాశాల విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేయడం, నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. TASK విద్యార్థుల బ్యాచ్‌లను రూపొందించడం, భౌతిక తరగతి గది సెషన్‌ల కోసం ప్రాంతాలను గుర్తించడం, ఈ శిక్షణా సెషన్‌ల కోసం క్యాలెండర్‌పై పని చేస్తుంది. మరోవైపు హెచ్‌సిసిబి కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, శిక్షకులను గుర్తించడం, నిపుణులైన శిక్షకుల సమూహాన్ని సృష్టించడం, విస్తరించడం కోసం ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్ (TTT) నిర్వహించడం, వర్చువల్, ఫిజికల్ క్లాస్‌రూమ్ సెషన్‌లను నిర్వహించడం వంటి వాటిపై పనిచేస్తుంది.

ఈ ఎమ్ఒయు ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ, తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి, సిహెచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. ”ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయాన్ని సృష్టించడమే మా ప్రయత్నం. వివిధ కార్పొరేట్‌లలో మెరుగ్గా విధులను నిర్వహించటం కోసం శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్‌లను అందించాలనే లక్ష్యంతో మరియు మన రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరులను తయారు చేయడంలో TASK చురుకుగా ముందుంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. వెనుకబడిన యువత, ఉత్పాదక శ్రామిక శక్తిలో చేరేందుకు వీలుగా మరియు వారికి సాధికారత కల్పించేందుకు మా ప్రయత్నాలలో భాగంగా మాతో భాగస్వామ్యం చేసుకున్నందుకు హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్‌ను కూడా నేను అభినందిస్తున్నాను. హెచ్‌సిసిబి వంటి వ్యూహాత్మక భాగస్వాములు తెలంగాణ కోసం “ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్” అనే మా లక్ష్యం దిశగా స్థిరంగా ఉండటానికి మాకు సహాయం చేస్తున్నాయి” అని అన్నారు.

పరిశ్రమలు, వాణిజ్యం, IT, E&C ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జయేష్ రంజన్ IAS, మాట్లాడుతూ, “హెచ్‌సిసిబి & తెలంగాణ ప్రభుత్వం మధ్య ప్రారంభమైన ఈ ఉమ్మడి కార్యక్రమం ఇప్పటివరకు ఆదర్శప్రాయంగా ఉంది. దేశవ్యాప్తంగా కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను నిర్వహించడంలో దాని అనుభవంతో, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యం కల్పించడం, వారికి మరింతగా ఉపాధి కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి హెచ్‌సిసిబి సమర్థవంతంగా సహకరించగలిగింది. రాష్ట్రంలో ఆర్థిక మరియు డిజిటల్ అక్షరాస్యతను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాలను మరింత విస్తరించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

ఈ భాగస్వామ్యాన్ని ఒక ప్రధాన మైలురాయి గా పేర్కొన్న TASK సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ.. “హెచ్‌సిసిబితో భాగస్వామ్యం చేసుకోవటం ఒక గొప్ప అనుభవం. సంయుక్తంగా మా భాగస్వామ్యం యొక్క మొదటి సంవత్సరంలోనే 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగలిగాము, మేము ఇదే విధమైన ఫలితాలను సాధించడానికి ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా, రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని సృష్టించే మా ప్రయాణంలో ఇతర సంస్థలు మాతో చేరేందుకు మేము ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేయగలము” అని అన్నారు .

హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్‌ చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ శ్రీ హిమాన్షు ప్రియదర్శి మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కథలో భాగస్వామ్యం కావడం ఒక గౌరవం, అదృష్టంగా భావిస్తున్నాము. రాష్ట్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్థలంలో మేము మా రెండవ కర్మాగారాన్ని నెలకొల్పుతున్నామనే వాస్తవం రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభంగా నిర్వహించడం కోసం సృష్టించబడిన అనుకూల వాతావరణానికి అతి పెద్ద నిదర్శనం. మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే ప్రయత్నాలలో రాష్ట్రంతో భాగస్వామిగా కొనసాగడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.

కార్యక్రమంలో భాగంగా, ఎన్‌ఐఐటి ఫౌండేషన్ భాగస్వామ్యంతో హెచ్‌సిసిబి నిర్వహిస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు కెరియర్ డెవలప్‌మెంట్ సెంటర్ (సిడిసి) నుండి శిక్షణను పూర్తి చేసిన విద్యార్థులకు ఉమ్మడి ధృవీకరణను కూడా హెచ్‌సిసిబి, తెలంగాణ ప్రభుత్వం అందిస్తాయి.

మ్యాన్‌పవర్ రిసోర్సింగ్ కంపెనీలకు కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్‌ల నుండి నేరుగా ప్రతిభవంతులను పొందడంలో సహాయపడే ఉద్దేశ్యంతో హెచ్‌సిసిబి, తెలంగాణ ప్రభుత్వంలు మ్యాన్‌పవర్ రిసోర్సింగ్ కంపెనీలను సైతం భాగం చేయటం ద్వారా కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లలో నిర్వహించబడే పాఠ్యాంశాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ కారణం చేత కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్‌ల నుండి శిక్షణ పొందిన యువత ప్లేస్‌మెంట్ రేటును మెరుగుపరుస్తోంది. రాష్ట్రంలో అటువంటి కార్యక్రమాలలో ఇంకా నమోదు చేసుకోని వర్గాల వారికి ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను అందించే కార్యక్రమాలు, పాఠ్యాంశాలను మరింత విస్తరించడానికి కూడా ఈ రెండు పార్టీలు భాగస్వాములవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News