Monday, May 6, 2024

ఒకటే కార్డు!

- Advertisement -
- Advertisement -

మన కామన్ మొబిలిటీ కార్డును ఆగష్టు 2 వ వారం నాటికి ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మొబిలిటీ కార్డుని తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, ఆర్టీసి సంస్థలు దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసి బస్సులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండేలా ఈ కార్డు ఉపయోగపడుతుందని అధికారులు మంత్రులకు వివరించారు. గురువారం దీనిపై సచివాలయంలో మంత్రులు కె. తారక రామారావు, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసి, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను మంత్రులకు అధికారులు వివరించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాల గురించి మంత్రులకు తెలియజేశారు.

త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్డు సేవలు
మొదట మెట్రో రైల్, ఆర్టీసి బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో సమీప భవిష్యత్‌లో ఎంఎంటిఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునే తీరుగా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. ఇదే కార్డుతో భవిష్యత్‌లో పౌరులు తమ ఇతర కార్డుల మాదిరే కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరిగా ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ వరకు ఈ కార్డు జారీ ఉంటుందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్డు సేవలు అందించేలా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు మంత్రులు అదేశించారు. ఈ కార్డు కలిగిన పౌరులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు.

దీంతో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ కార్డు వలన ఇతర మెట్రో నగరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆర్టీసి బస్సులు లేదా మెట్రో రైల్ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండో వారంలోగా నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్, ఆర్టీసి సంస్థ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని వారు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకి ఒక పేరును సూచించాలని మంత్రులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను సూచించాలని కోరుతూ ట్వీట్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి, ఆర్టీసి ఎండి సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News