Sunday, April 28, 2024

కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..

- Advertisement -
- Advertisement -
దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టండి.. నిధులను ఇప్పిస్తాం
తొమ్మిదే-ళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
ప్రభుత్వంపై -కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మండిపాటు

హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. గురువారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలనకు శంషాబాద్ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ.. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్‌లో కూర్చొని అణిచివేస్తారా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లూ వారికి ఇవ్వడం లేదన్నారు. బిఆర్‌ఎస్‌పై మా ఉద్యమం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేసిన ఇళ్లను చూద్దామని బయలుదేరాం. శంషాబాద్ విమానాశ్రయం వద్ద నన్ను అడ్డుకున్నారు. పలువురు నేతలనూ అరెస్ట్ చేశారు. ఇవాళ ధర్నా, ఆందోళన కాదని చెప్పినా.. పోలీసులు మా పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. బడుగు బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుసుకోవడానికి వెళ్తే ఇలా వ్యవహరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజల సమస్యల తరఫున ఈ యుద్ధం కొనసాగిస్తాం..
ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. నాతో అలా వ్యవహరించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పోలీస్ కమిషనర్, డిసిపిలు కలిసి అమానుషంగా ప్రవర్తించారు. కల్వకుంట్ల కుటుంబపాలనలో ప్రజలు తమ నీడను తామే చూసుకొని భయపడాల్సి వస్తోంది. ఇచ్చిన హామీల్లో సిఎం కెసిఆర్ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ప్రజల ఆవేదన, ఆక్రోశం.. బిజెపి నేతల అరెస్టులతో తగ్గదు. ఈ రోజు యుద్ధం మొదలైంది. బిఆర్‌ఎస్‌తో యుద్ధానికి మేం సిద్ధం. ప్రజల సమస్యల తరఫున ఈ యుద్ధం కొనసాగిస్తాం. మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. ఎన్నో సార్లు జైలుకు వెళ్లాం. తండ్రిని అడ్డం పెట్టుకొని మాకు పదవులు రాలేదు. వారి పాపాలు పండాయి. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు ఇవాళ్టి పరిణామాలపై ఆలోచించాలి” అని కిషన్‌రెడ్డి కోరారు.
50 లక్షల ఇండ్లు కట్టండి.. కేంద్ర ప్రభుత్వం వాటాను ఇప్పిస్తాం..
బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో 50 లక్షల ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. 50 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత తనదేనన్నా రు. బిఆర్‌ఎస్‌ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి బిఆర్‌ఎస్‌కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవని ప్రశ్నించారు.పేదల పట్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నా రు. అరకొరగా కట్టిన ఇండ్లు కూడా తొమ్మిదేళ్లుగా ఎవరికి ఇవ్వ లేదన్నా రు. తొమ్మిది సంవత్సరాలైనా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని, చేతకాని ప్రభుత్వం అంటూ విమర్శించారు. కెసిఆర్ అభద్రతాభావంతో ఉన్నారు కాబట్టే బిజెపి నేతలను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
నన్ను చంపేయండి..నేను ఇంటికి మాత్రం వెళ్ళను
అంతకు ముందు ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే.. పోలీసులు బాటసింగారంలోని డబుల్ ఇండ్లను పరిశీలించేందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. భారీ వర్షంలోనూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన బాట సింగారం వెళ్లి తీరుతా. నేనేమైనా క్రిమినల్ నా? కేంద్ర మంత్రిని అడ్డుకుంటారా? పోలీసు వాహనం అడ్డుపెట్టి ఆపుతారా? నిజాం కన్నా అధ్వానమైన పాలన ఇక్కడ ఉంది’ అని మండ్డిపడ్డారు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారని, పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి విమర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్‌రావు, చింతల రామచంద్రారెడ్డి, బిజెపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News