Wednesday, May 1, 2024

Congress : ప్రధాని మోడీ మౌనమే దీనికి కారణం…

- Advertisement -
- Advertisement -

చైనా పేర్ల మార్పుపై కాంగ్రెస్ మండిపాటు

న్యూఢిల్లీ : భారత భూభాగం అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతూ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను కేంద్రం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. మరోవైపు చైనా పేర్ల మార్పు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చైనా విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మౌనం ఫలితమే ఇదంతా అంటూ విరుచుకుపడింది. చైనా ఆక్రమణల విషయంలో ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

‘అదానీ షెల్ కంపెనీల్లో 20 వేల కోట్ల బినామీ సొమ్ము ఎవరిది? ఈ విషయంలో ప్రధాని మౌనం వహిస్తున్నారు. ఏం సమాధానం చెప్పడం లేదు. మరోవైపు భారత భూభాగంలో చైనా రెండు వేల చ.కి మీలను ఆక్రమించింది. స్థలాల పేర్లు కూడా మారుతున్నాయి. ఈ విషయం లోనూ ప్రధానిది మౌనమే. ఇక్కడా సమాధానం లేదు. ప్రధాన మంత్రి జీ. ఎందుకింత భయం? ’ అని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. చైనా చర్యలపై ప్రధాని మోడీ మౌనం, గల్వాన్ ఘర్షణపై ఆ దేశానికి క్లీన్‌చిట్ ఇవ్వడం తగదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. డ్రాగన్ విషయంలో ప్రధాని మోడీ తీరే దీనికి కారణమని జైరాం రమేశ్ మండిపడ్డారు. అరుణాచల్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఇరు నేతలు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా మూడో విడతలో పేర్లు మార్చిన విషయం తెలిసిందే. చైనా తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగం. కొత్తగా పేర్లు పెట్టడం వంటి ప్రయత్నాల వల్ల నిజాలు మారవు ’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. చైనా 2017లో తొలిసారి అరుణాచల్ లోని ఆరు ప్రాంతాలకు చైనీస్ పేర్లను విడుదల చేసింది. ఆ తర్వాత 2021లోనూ 15ప్రాంతాలకు రెండోసారి పేర్లను విడుదల చేసింది. అయితే పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్‌లో భూభాగం కాకుండా పోవని కేంద్రం గతంలో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News