Monday, April 29, 2024

నెల రోజుల్లో రెట్టింపు

- Advertisement -
- Advertisement -

24 గంటల్లో సుమారు 400 కేసులు, ముగ్గురు మృతి
విద్యాసంస్థలపై కొనసాగుతోన్న వైరస్ పంజా
హైదరాబాద్ పాతబస్తీలోని బిసి హాస్టల్‌లో 9మంది బాలికలకు, శంషాబాద్ గురుకుల స్కూల్లో మరో 21 మందికి పాజిటివ్
వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్న ప్రజలు

Corona for 22 People in Same Family in Suryapet

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 400 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. వీరిలో సుమారు 100 మందికి పైగా విద్యార్ధులు ఉండడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నెల రోజుల్లోనే కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అయింది. ముఖ్యంగా విద్యాసంస్థలపై అత్యధిక వ్యాప్తి కొనసాగుతుంది. భౌతిక దూరం పాటించకపోవడం వలనే విద్యార్ధుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ ఇప్పటికే అంచనా వేసింది.ఈమేరకు బోర్డర్లలో ప్రత్యేక పరీక్షలు చేస్తున్నప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. వైరస్ తీవ్రత మరింత పెరగకముందే అర్హులైన వారంతా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యశాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది.
కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో టెన్షన్…
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో టెన్షన్ ప్రారంభమైంది. గతేడాది ఇదే నెల నుంచి వందల్లో ప్రారంభమైన కేసులు వ్యాప్తి క్రమక్రమంగా పెరిగి సుమారు ఐదారు నెలల వ్యవధిలో లక్షల్లోకి చేరాయి. దీంతో ఈ సారి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని ప్రజలతో పాటు అధికారుల్లో కూడా భయాందోళన కనిపిస్తుంది. ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో ఒక్కసారిగా వైరస్ విజృంభించింది. ఆ వ్యాప్తి మన రాష్ట్రానికి వస్తే మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారేమోనని అనేక మందికి అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర తీవ్రత తక్కువున్నప్పటికీ, మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ యోచిస్తుంది.
నెల రోజుల్లో కేసులు డబుల్….
ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా 648 మందికి పాజిటివ్ తేలగా, నలుగురు చనిపోయారు. అదే విధంగా ఈనెల 18 నుంచి 21 వరకు ఏకంగా 1349 మందికి వైరస్ సోకగా, పది మంది మరణించారు. అంటే నెలరోజుల్లోనే బాధితుల సంఖ్య రెట్టింపైంది. అంతేగాక మరణాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో అధికారులు కూడా కలవరం చెందుతున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం ప్రజలంతా సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ప్రస్తుతానికి కేంద్రం ప్రభుత్వం సూచించిన కేటగిరీల ప్రకారం మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా, అతి కొద్ది రోజుల్లో మిగతా వారందరికీ టీకా ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు. మరోవైపు అర్హత కలిగి ఇప్పటి వరకు టీకా తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు.
అన్ని స్కూల్స్‌లో ర్యాపిడ్ టెస్టులు…
రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని స్కూళ్లల్లో ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల అధికారులకు సూచించింది. కేసులు తేలిన విద్యాసంస్థలతో పాటు మిగతా వాటిలోనూ విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.ప్రతి స్కూల్, హాస్టల్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు కాంటాక్ట్‌లను వేగంగా ట్రేస్ చేయాలని ఆదేశించింది. పాజిటివ్ సోకిన బాధితులను ఐసోలేషన్ సెంటర్లుకు తరలించాలని పేర్కొంది. అంతేగాక ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు యాంటీజెన్ టెస్టు విధానంలో వెంటనే టెస్టు చేసి క్వారంటైన్‌లో ఉంచాలంది. లక్షణాలు ఉన్న వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లను హాస్టల్స్‌లో వేర్వేరు రూంలలో ఉంచాలని సూచించింది. అలాంటి సౌకర్యం లేనిచో వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని వివరించింది. మరోవైపు పాజిటివ్ వచ్చిన బాధితులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా విద్యార్ధులను తల్లిదండ్రుల వద్దకు పంపొద్దని వైద్యశాఖ స్పష్టం చేసింది. దీంతో వైరస్ తీవ్రత మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రతి విద్యార్ధిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.
నేటితో జనతా కర్యూకి ఏడాది పూర్తి….
వైరస్ తీవ్రత నియంత్రణకు దేశ వ్యాప్తంగా తొలి సారి ప్రకటించిన జనతా కర్ఫూకి ఈరోజుతో ఏడాది పూర్తవుతోంది. వైరస్ బారిన పడిన ప్రజలను ప్రాణాలకు తెగించి చికిత్సను అందిస్తున్న వైద్యులకు సంఘీభావంగా దేశ ప్రధాని మార్చి 22 వ తేదిన జనతా కర్ఫూని విధించి ప్రజలు మద్దతును కోరారు. అపట్లో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. కానీ వివిధ దేశాల పరిస్థితులు, వైద్యులు, నిపుణుల సూచన మేరకు తెలంగాణలో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు సిఎ కెసిఆర్ మార్చి 23వ తేదిన అందరికంటే ముందు లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా కూడా క్రమక్రమంగా వ్యాప్తి భారీగా పెరగడంతో విడతల వారీగా పొడిగిస్తూ, జూన నుంచి అన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
మరోసారి మార్గదర్శకాలు…
కరోనా నియంత్రణకు వైద్యశాఖ మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పక 14 రోజుల పాటు స్వీయనిర్భందంలో ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయినవారు తప్పక ఐసోలేషన్ ఉండాలి. కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా తక్షణం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి.
కోవిడ్ 19కి సంబధించిన ఎలాంటి సమాచారం కోసమైనా 104ని సంప్రదించాలి.తుమ్మేటప్పుడు, దగ్గేప్పుడు తప్పనిసరిగా ఖర్చీఫ్ లు, టిష్యూ పేపర్లను వినియోగించాలి. తరచు చేతులను సబ్బు నీటితో, సానిటైజర్లతో కనీసం 30 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి . ఎక్కువ జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో సంచరించవద్దని హెచ్చరించింది.

Corona cases again rise in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News