జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి
డబ్ల్యుహెచ్ఒ నిపుణుల బృందం
వుహాన్: చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైనట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఒ)నిపుణుల కమిటీ సభ్యుడు, జంతువ్యాధుల నిపుణుడు పీటర్బెన్ ఎంబారెక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యవర్తి జీవుల(జంతువుల) నుంచి మానవులకు వ్యాప్తి జరిగినట్టు ఆయన తెలిపారు. అయితే, వైరస్ మూలాలను గుర్తించేందుకు మరింత పరిశోధన అవసరమని సూచించారు. చైనాలో తమ దర్యాప్తు ద్వారా తేల్చిన అంశాల్ని ఆయన సంక్షిప్తంగా వివరించారు. చైనా నగరం వుహాన్లోని వైరాలజీ ల్యాబ్లో పరిశోధనల కోసం సేకరించిన వైరస్ శాంపిళ్ల నుంచి కరోనా లీకైందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా పుట్టుకపై వాస్తవాల్ని చైనా దాచి పెడుతున్నదన్న ప్రపంచ దేశాల విమర్శల నేపథ్యంలో చివరికి ఆ దేశంలో దర్యాప్తునకు నిపుణుల కమిటీకి అనుమతిచ్చింది. పది దేశాలకు చెందిన నిపుణులు ఆ దేశంలో పర్యటిస్తూ వుహాన్లోని పలు అనుమానిత ప్రాంతాల్లోకి వెళ్లి పరిశీలించారు. చైనాలో మొదటి కరోనా కేసులు వుహాన్లో 2019 డిసెంబర్లో నమోదైనట్టు ఆ దేశం తెలిపింది. అయితే, చైనా మాటలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.