వారణాసి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ చీరలకు కూడా కరోనా వైరస్ బెదద చుట్టుకుంది. వారణాసిలో తరాలుగా నేసే బనారస్ చీరలకు చైనా నుంచి పట్టు దారాన్ని దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అయితే కరోనా వైరస్ను అంతర్జాతీయ ఆరోగ్య ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. దీనితో భారత్తో పాటు పలు దేశాలు చైనా దిగుమతులను నిలిపివేశాయి. చైనాకు రాకపోకలను నియంత్రించాయి. ఈ దశలో చైనా నుంచి 1500 టన్నుల పట్టుదారం దిగుమతిని భారతదేశం నిలిపివేసింది. దీనితో శ్రేష్టమైన పట్టు లేకపోవడంతో బనారస్ చీరల తయారీదార్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి చీరల తయారీ ఆర్డర్లు పొందిన తాము నాణ్యత లోపించకుండా చీరలను నేసేదెట్టా అనే మీమాంసలో పడ్డారు.
చైనా సిల్క్పై నిషేధం తాత్కాలికమే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా నుంచి గత నెల 20వ తేదీనుంచే పట్టు రావడం ఆగిపోయిందని బనారస్ చీరల సంబంధిత వేవర్స్టోరీ డాట్కామ్ వ్యవస్థాపకులు నిషాంత్ మల్హోత్రా తెలిపారు. ఇప్పటికే నౌకల ద్వారా చైనా నుంచి వచ్చిన పట్టు నిల్వలను కూడా రవాణా చేయడం లేదని, దీనితో పట్టుచీరల నేతపనివాళ్లు, సంబంధిత వ్యాపారాలు, వేలాది దుకాణాల వారు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముడిసరుకు రాకుండా చీరలు నేయలేరని, చేతిలో పనిలేకుండా కార్మికులు మనజాలలేరని తెలిపారు. ప్రస్తుతానికి అవసరమైన ముడిసరుకు ఉందని, అయితే ఇక ముందు రాకపోతే పరిస్థితి ఏమిటనేది అగమ్యగోచరంగా ఉందన్నారు.
Coronavirus affected Banarasi sarees industry