న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండు మూడు వారాల్లో ప్రారంభిస్తామని పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆదివారం వెల్లడించింది. మనుషులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్ లోకి ప్రవేశ పెడతామని వివరించింది. ప్రపంచంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఏడింటిలో ఒకటైన పుణె సంస్థ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్రిటన్లో సెప్టెంబర్అక్టోబర్లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతాయి. మరి కొన్ని వారాల్లో భారత్లో ఈ ట్రయల్స్ ప్రారంభిస్తారు. నెలకు 5 మిలియన్ డోస్ల వంతున మొదటి ఆరు నెలలు ఉత్పత్తి చేస్తారు. రానురాను నెలకు 10 మిలియన్ డోస్ల వంతున ఉత్పత్తిని పెంచుతామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ ఆడర్ పూనావాలా చెప్పారు. ఆక్స్ఫర్డ్ వర్శిటీకి చెందిన డాక్టర్ హిల్తో తమ బృందం కలసి పనిచేస్తోందని ఆయన అన్నారు. గతంలో మలేరియా వ్యాక్సిన్ ప్రాజెక్టులో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో కలసి ఈ సంస్థ పనిచేసింది.