భారత్ బయోటెక్ ఎండి క్రిష్ణా ఎల్లా వెల్లడి
హైదరాబాద్ : 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగించే కొవాగ్జిన్ వ్యాక్సిన్ 2/3 ట్రయల్స్ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. ఈ ట్రయల్స్ డేటా భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) కి వచ్చేవారం సమర్పించనున్నట్టు భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణా ఎల్లా వెల్లడించారు. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. కొవాగ్జిన్ ఉత్పత్తి సెప్టెంబర్లో 3.5 కోట్ల డోసులు ఉండగా, అక్టోబర్ నాటికి 5.5 కోట్ల డోసులకు చేరుతుందని చెప్పారు. ఒక వేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే వీటి సంఖ్యను నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమౌతుందని చెప్పారు. ఈ ట్రయల్స్ వెయ్యిమంది వాలంటీర్లపై జరిగినట్టు చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే ఈ నాసికా వ్యాక్సిన్ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
వైరస్కు ప్రవేశ ద్వారమైన ముక్కులో వైరస్ నుంచి రక్షణ, వ్యాప్తి నిరోధకం, వైరస్ సోకకుండా ఉండేలా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. మూడు గ్రూపుల వారీగా ఈ ట్రయల్స్ జరుగుతున్నాయని వివరించారు. మొదటి గ్రూపు వారికి తొలిడోసుగా కొవాగ్జిన్ ఇచ్చి, రెండో డోసుగా ముక్కు ద్వారా తీసుకునే డోసు ఇస్తున్నామని తెలిపారు. అదే విధంగా రెండో గ్రూపులో తొలి, రెండో డోసును ముక్కు వ్వారా అందిస్తున్నామని, మూడో గ్రూపులో ముక్కు ద్వారా తొలిడోసు, కొవాగ్జిన్ను రెండో డోసుగా ఇచ్చి పరీక్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రయోగాలను 650 వాలంటీర్లపై జరుపుతున్నామని, 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తూ పరీక్షిస్తున్నామని కృష్ణ ఎల్లా వెల్లడించారు.