ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ లంగర్హౌస్లోని బాపుఘాట్లో శనివారం నివాళులర్పించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని కమిషనరేట్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ గాంధీ జయంతిని నిర్వహించుకోవడం గర్వకారణమని అన్నారు. గాంధీ జయంతిని అహింసా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం గొప్ప విషయమని అన్నారు. అంటరానితనం, మానవహక్కుల కోసం గాంధీ దక్షిణాఫ్రికాలో పోరాడారని తెలిపారు. నిజం, అహింస, స్వరాజ్ నినాదాలు ప్రతి సర్వీస్లో భాగమని తెలిపారు. కార్యక్రమంలో ఎడిసిపి మాణిక్ రాజ్, ఎస్బి ఎడిసిపి రవికుమార్, సిఎస్డబ్లూ వెంకట్రెడ్డి, ఎస్సిఎస్సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల, ఎసిపి సురేందర్ రావు, ఎసిపి మట్టయ్య, ఎసిపి కృష్ణ, ఇన్స్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.