ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా
జైపూర్: పొరుగు రాష్ట్రమైన పంజాబ్తోపాటు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో తన ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడి తన నివాసంలో శనివారం ప్రశాసన్ షరోన్ కే సంగ్-ప్రశాసన్ గావో కే సంగ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గెహ్లాట్ ప్రసంగిస్తూ పంజాబ్ తర్వాత రాజస్థాన్, ఛత్తీస్గఢ్ గురించి ఊహాగానాలు సాగుతున్నాయని అయితే రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం తన పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏదీ లేదని తన వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన దరిమిలా రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ సంక్షోభంలో పడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు సాగుతున్నాయి.