Thursday, May 9, 2024

రెజ్లర్లపై పోలీసుల దాడి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నిరసన దీక్షలో ఉన్న రెజర్లపై ఢిల్లీ పోలీసులు బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత దాడికి దిగారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ ఘటనతో అక్కడి రెజర్లు, వారి అభిమానులు ఏకమై పోలీసులతో కలబడటం, ఈ దశలో పోలీసులకు వీరికి మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకోవడం కలకలానికి దారితీసింది. ఘర్షణల దశలో ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి అయిన వినేష్‌కు , బజ్‌రంగ్‌లకు గాయాలు అయ్యాయి. దుశ్యంత్ ఫోగాట్ నుదుటిపై గాయం అయింది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ దశలోనే తాము తగు విధంగా వ్యవహరించామని పోలీసు అధికారులు తెలిపారు. తాము తమ తోటి రెజర్ల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసించేందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నామని, రాత్రి వర్షం పడటంతో ఇక్కడికి మరికొన్ని బెంచ్‌లు ,చాపలు తీసుకుని వచ్చేందుకు యత్నించామని ,

దీనిని పోలీసులు అడ్డుకున్నారని రెజర్ల సంఘాలు తెలిపాయి. ధర్నా జరిపే వారికి సౌకర్యాలు ఎందుకు అని అక్కడ ఉన్న పోలీసులలో ఓ తాగి ఉన్న పోలీసు దుర్భాషలాడారని వెల్లడైంది. ఈ క్రమంలో రెజర్లకు పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. పోలీసు బాగా తాగి మహిళా రెజర్ల పట్ల అసభ్యంగా వ్యవహరించాడని , వారిని బూతులు తిట్టాడని అక్కడివారు ఆరోపించారు. పలువురు రెజర్లను నెట్టివేశారని విమర్శలు వెలువడ్డాయి. బజ్‌రంగ్ పునియా, రెజ్లర్ సాక్షి భర్త సత్యవర్త్ కదియన్ జోక్యం చేసుకోబోగా ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగిందని వెల్లడైంది. ఈ దశలో పోలీసులు లాఠీలు ప్రయోగించారు. దీనితో బజ్‌రంగ్ భుజానికి దెబ్బతగిలింది. వినీష్‌కు మోకాలి గాయం అయింది. నుదుటిపై గాయం అయిన దుష్యంత్ ఫోగాట్‌ను చికిత్సకు ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌కు తరలించారు. పలువురు రెజ్లర్లను అరెస్టు చేసి తీసుకువెళ్లడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వీరిని అడ్డుకుంటూ వినెష్ అడ్డంగా పడుకున్నారు.

దీనితో ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెను కొట్టినట్లు వెల్లడైంది. తనను ఢిల్లీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ధర్మేందర్ కుమార్ సింగ్ తిట్టారని వినేష్ ఆరోపించారు. ఇటువంటి అత్యాచారాలు, ఈ విధమైన అవమానాలు భరించేందుకా తాము దేశం కోసం పతాకాలు సాధించింది అని పలువురు రెజర్లు నిరసన వ్యక్తం చేశారు. తమను చంపివేస్తే చంపివేయండి కానీ ఈ విధంగా వేధించుకు తినకండని రెజ్లర్లు ఆగ్రహించారు.అర్థరాత్రి తరువాత ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరాయి. 20 మంది రెజర్లు అక్కడ ఉండగా వీరిచుట్టూ రెండు వందల మంది వరకూ పోలీసులు నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News