గ్రేటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసుల కేసు
అయినా.. రైతుల ఉద్యమానికి మద్దతు కొనసాగిస్తా థన్బర్గ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన యువ ఉద్యమకారిణి, వాతావరణంపై ప్రచారం చేసే గ్రేటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఆమె చేసిన ట్వీట్లను తీవ్రంగా పరిగణించారు.‘నేరపూరిత కుట్ర, మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం’ వంటి ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో థన్బర్గ్ పేరు లేదని ఢిల్లీ పోలీసులు తర్వాత వివరణ ఇచ్చారు. అయితే కేసులు పెట్టినప్పటికీ తాను భారత్లో ఆందోళణ చేస్తున్న రైతులకు సంఘీభావంగా నిలుస్తానని, ఎంతటి విద్వేషం, బెదిరింపులు లేదా మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా దాన్ని మార్చలేవు’ అని థన్బర్గ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
భారత రైతుల ఆందోళనకు మద్దతుగా థన్బర్గ్ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ‘భారత రైతుల నిరసనలకు సంఘీభావం తెలుపుదాం’ అంటూ ఆమె మంగళవారం ఓ ట్వీట్ చేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఫోటోను ఆందులో పోస్ట్ చేశారు. రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఆన్లైన్ పిటిషన్ లింక్ను కూడా ఆమె తన తాజా ట్వీట్తో పాటుగా షేర్ చేశారు. భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చేలా దీని ద్వారా మీరు రైతులకు మద్దతు తెలియజేయవచ్చని అందులో పేర్కొన్నారు. రైతులపై ప్రభుత్వ హింసను ఖండించడం, నిరసనకారులతో చర్చలు జరపాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, రైతుల నిరసనలపై మౌనం వహించకుండా, వారి అసమ్మతిని ఎగతాళి చేయడాన్ని వ్యతిరేకించే లక్ష్యంగా ఈ పిటిషన్పై సంతకాలు చేయాలని గ్రేటా పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఐక్యరాజ్య సమితితో పాటుగా పలు అంతర్జాతీయ సంస్థలకు ట్యాగ్ చేయవచ్చని సూచించారు.
Delhi Police Files FIR Against Greta Thunberg