Saturday, May 4, 2024

కాళేశ్వరం నీళ్లు రానిదే ఇన్ని వడ్లు పండినాయా..?

- Advertisement -
- Advertisement -
  • కాళేశ్వరం నీళ్లతో ఒక ఎకరం సాగు కాలేదు అన్నోళ్లను అప్పలాయ చెరువులో ముంచాలి
  • సిద్దిపేటలో 3 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం
  • అప్పలాయ చెరువు గ్రామం చిన్నదైనా ప్రజల మనసు పెద్దది
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

నంగునూరు: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికి కూడా సాగు నీరు అందలేదన్నోళ్లను అప్పలాయచెరువులో ముంచాలని, సాగునీరు అందనిదే ఇన్ని వడ్లు పండినాయా అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రతిపక్షాలను నిలదీశారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం అప్పలాయ చెరువు గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ. అప్పలాయచెరువు గ్రామం చిన్నదైనా.. గ్రామప్రజల మనసు చాలా పెద్దది అని అన్నారు. ఒకనాడు గ్రామంలో బస్టాండ్, రోడ్డు గానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు.

సిఎం కెసిఆర్ నేతృత్వంలో అప్పలాయ చెరువును గ్రామంగా ఏర్పాటు చేసుకోని నేడు గ్రామంలో అనేక అభివృద్ధి పనులను చేసుకున్నామని తెలిపారు. నాడు కాంగ్రెస్ పాలనలో తాగునీరు, విద్యుత్ తో పాటు అనేక సమస్యలతో గ్రామ ప్రజలు అల్లాడిపోయే వారని, నేడు కెసిఆర్ పాలనలో మిషన్ భగీరథతో ప్రతి ఇంటి వద్దకే తాగునీరు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్, కాళేశ్వరంతో సాగు నీరు, పలు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. గత పాలనలో ఎరువుల కోసం రైతులు చెప్పులను లైన్‌లో పెట్టి అవస్థలు పడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పక్కనే ఉన్నా మహారాష్ట్రలో ప్రభుత్వం రైతుల దగ్గర వడ్లు కొన్నా ఆరు నెలలైనా వడ్ల పైసలు ఇవ్వలేకపోతుందని అన్నారు.త్వరలోనే రంగనాయక సాగర్ ద్వారా సాగు నీరు అందుతుందని తెలిపారు.

పంట సాగు లేట్ చేయడం మూలాన రాళ్ల వాన, అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులు వీలైనంత తక్కువ వ్యవధిలో చేతికచ్చే పంటను సాగు చేయాలన్నారు. అంతేకాకుండా రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆపదలోనైనా, పండుగైనా అప్పలాయ చెరువు గ్రామాన్ని మరువలేదని, రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక గ్రామ సర్పంచ్ గట్టు మల్లవ్వ, జడ్పిటిసి తడిసిన ఉమా, మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, ఆయిల్ ఫామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, సీనియర్ నాయకులు వేముల వెంకట్ రెడ్డి, దువ్వల మల్లయ్య, బద్దిపడగ కృష్ణారెడ్డి, సంగు పురేందర్, రమేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News