Monday, May 6, 2024

16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు..

- Advertisement -
- Advertisement -

16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు
20 నుంచి వెబ్ ఆప్షన్లు
జూన్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు
దోస్త్ 2023 నోటిఫికేషన్ విడుదల
ఈ సారి కొత్తగా దోస్త్ యాప్ ద్వారా సేవలు
మూడు విడతల్లో ప్రవేశాలు
1,054 డిగ్రీ కాలేజీలు.. 3,86,544 సీట్లు
జులై 17 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ – తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీనన్ మిట్టల్ దోస్త్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, మహిళా విశ్వవిద్యాలయం, జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది. ఈసారి కొత్తగా దోస్త్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్, మీ సేవా ద్వారా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం కొనసాగనుంది. ట యాప్ ఫేస్ రికగ్ననైజేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. దోస్త్ రిజిస్ట్రేషన్, ఇతర అంశాలలో విద్యార్థులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ చాట్‌బాట్‌తో పాటు యాప్‌లో కూడా చాట్‌బాట్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చైర్మన్ లింబాద్రి తెలిపారు. 7901002200 దోస్త్ వాట్సాప్ నెంబర్ ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుందని, అందులో విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.

దోస్త్ ఫేస్‌బుక్ పేజీ: facebook.com/dost.telangana,
దోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/dost. telangana
దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200

మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు
రాష్ట్రంలో దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు మూడు విడతలుగా ప్రవేశాల ప్రక్రియ చేపటనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మే 20 నుంచి జూన్ 11 వరకు దోస్త్ వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని.. జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తామని చెప్పారు. కొవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా డిగ్రీ ప్రవేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయయని, ఈసారి షెడ్యూల్ ప్రకారం సకాలంలో డిగ్రీ తరగతులు ప్రారంభిస్తామని కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలు ఉండగా, అందులో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, ఈ కాలేజీల్లో 3,86,544 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో 4,73,214 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా, డిమాండ్ లేని సీట్లను తగ్గించినట్లు తెలిపారు.

దోస్త్ షెడ్యూల్..

మే 16 నుంచి జూన్ 10 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
జూన్ 16వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూన్ 16 నుంచి 25 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
జూన్ 16 నుంచి 26 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జూన్ 16 నుంచి 27 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
జూన్ 30వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జులై 1 నుంచి 7 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
జులై 1 నుంచి 5 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జులై 1 నుంచి 6 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
జులై 10వ తేదీన మూడవ విడత సీట్ల కేటాయింపు
జులై 10 నుంచి 14 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
జులై 10 నుంచి 15 వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం
జులై 11 నుంచి 15 వరకు విద్యార్థులకు కళాశాలల్లో ఒరియెంటేషన్ క్లాసులు.
జూలై 17 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News