దోస్త్ నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 24 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు
మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు
ఈ సారి డి.ఫార్మసీ, డిహెచ్ఎంసిటి
డిప్లొమా కోర్సులు కూడా దోస్త్ ద్వారానే
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 24 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛైర్మన్ టి.పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్లు పాల్గొన్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేశారు. ఈ సారి రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అందించే డి.ఫార్మసీ, డిహెచ్ఎంసిటి డిప్లొమా కోర్సులకు నిర్వహించే అడ్మిషన్ ప్రక్రియ కూడా దోస్త్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ సారి ఆధార్ అనుసంధానం లేని ఫోన్ల నుంచి దోస్త్కు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఆధార్ అనుసంధానం లేని ఫోన్ నెంబర్లు కలిగి ఉన్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లతో ఆధార్కు అనుసంధానం చేసుకోవచ్చు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహాయ కేంద్రాలు, మీ సేవా కేంద్రాలతో పాటు ఆధార్ అనుసంధానం ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి దరఖాస్తు చేసుకునే పాత విధానం కూడా అమలులో ఉంటుంది.
కొత్తగా యాప్లో ద్వారా రిజిస్ట్రేషన్
కోవిడ్-19 నేపథ్యంలో ఈసారి టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అందు బాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్లో ఫేస్ రికగ్ననైజేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ సౌకర్యం కేవలం తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. ఈ యాప్లో విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి, అనంతరం విద్యార్థులు సెల్ఫీ ఫొటో తీసుకునే ఆప్షన్ వస్తుంది. అందులో సెల్ఫీ ఫొటోను అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. దోస్త్ రిజిస్ట్రేషన్, ఇతర అంశాలలో విద్యార్థులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ సారి ఆన్లైన్ ఫిర్యాదుల విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే విద్యార్థుల సందేహాల నివృత్తికి దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200ను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్కు హాయ్ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుందని, అందులో విద్యార్థులు తమ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు కోరితే వారి వాట్సాప్ నెంబర్కు ఒటిపి, ఇతర అలర్ట్ కూడా వస్తాయి. వీటితోపాటు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.
దోస్త్ ఫేస్బుక్ పేజీ: facebook.com/dost.telangana,
దోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/dost. telangana
దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200
ఇదీ దోస్త్ షెడ్యూల్
ఆగస్టు 24 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
సెప్టెంబర్ 16వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం
సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
సెప్టెంబర్ 28వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం
సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
అక్టోబర్ 8వ తేదీన మూడవ విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్ 8 నుంచి 10 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం
మొదటి విడత, రెండవ విడత, మూడవ విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 8 నుంచి 12 వరకు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి.
TS DOST Notification 2020 released