మలప్పురం(కేరళ): ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, కొట్టక్కల్ ఆర్య వైద్యశాల(కెఎఎస్) మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పికె వారియర్ శనివారం తన 100వ ఏట కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం ఆయన తన స్వగృహంలో కన్నుమూసినట్లు ఆయర కుటుంబ వర్గాలు తెలిపాయి. 1999లో పద్మశ్రీ, 2010లో పద్మ భూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. వైద్యునిగానే కాక దార్శనికుడిగా డాక్టర్ వారియర్ ప్రాచీన ఆయుర్వేద చికిత్సను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో విశేష కృషి చేశారు. డాక్టర్ వారియర్ శత జన్మదిన ఉత్సవాలు ఈ ఏడాది జూన్ 8న అత్యంత వైభవంగా జరిగాయి.
ఇక్కడకు సమీపంలోని కొటక్కల్లో ఉన్న ప్రసిద్ధ ఆర్య వైద్యశాల, ఆయుర్వేద వైద్య కళాశాల బాధ్యతలను కొన్ని దశాబ్దాల క్రితం ఆయన చేపట్టిన తర్వాత వాటికి గొప్ప గుర్తింపును తీసుకురావడంలో ఆయన పాత్ర అపూర్వం. 1921 జూన్ 5న శ్రీధరన్ నంబూద్రి, పన్నియంపిళ్లి కున్హి వారియర్ దంపతులకు జన్మించిన పన్నియంపిళ్ళి కృష్ణన్కుట్టి వారియర్(పికె వారియర్) కొట్టక్కల్లో విద్యాభ్యాసం అనంతరం తన 20వ ఏట కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో చేరారు. 24వ ఏట కెఎఎస్ ట్రస్టీగా ఆయన బాధ్యతలు చేపట్టారు.