Monday, April 29, 2024

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ. 711.18 కోట్ల లాభాల బోనస్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో నిధుల విడుదల
ఈ నెల 16 న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ
ప్రకటించిన సంస్థ సి అండ్ ఎండి ఎన్.శ్రీధర్
సగటున ఒక్కో కార్మికునికి రూ.1.53 లక్షల బోనస్
సింగరేణి చరిత్రలో అత్యధికంగా 32 శాతం లాభాల వాటా.. అత్యధిక చెల్లింపులు

మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16 వ తేదీన చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విదంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయల లో 32 శాతం లాభాల బోనస్‌ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన తెలిపారు .సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతం లో కన్న ఎక్కువ శాతాన్ని లాభాల వాటా ప్రకటించిన రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖరరావుకు సింగరేణి ఉద్యోగుల తరఫున ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్. బలరామ్ గురువారం సర్క్యులర్ ను జారీ చేశారు.

దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీ లో లేని విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది తనకు వచ్చిన నికర లాభాల్లో కొంత శాతం వాటాను లాభాల బోనస్ గా కార్మికులకు పంచడం జరుగుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గతంలో కన్నా ఎక్కువ శాతం లాభాల వాటా బోనస్ ను ప్రకటిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాకపూర్వం 2013 -14లో ఇది 20 శాతం ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని పెంచుతూ 2014-15 లో 21 శాతం, 2015-16లో 23 శాతం (245.21 కోట్లు) 2016-17లో 25 శాతం (98.85 కోట్లు), 2017-18 లో27 శాతం (327.44 కోట్లు), 2018 19 లో 28 శాతం (493.82 కోట్లు), 2020-21 లో29 శాతం (79.07 కోట్లు), 2021-22లో 30 శాతం (368.11 కోట్లు) ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు 2222 కోట్ల రూపాయల లో 32 శాతం అనగా రూ.711.18 కోట్ల ను లాభాల బోనస్ గా కార్మికులకు చెల్లించాలని ఇటీవలే ఆదేశించారు. అదే విధంగా అ దసరా పండుగకు ముందే ఇది కార్మికుల చేతికి అందేలా చూడాలని ఇటీవల యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం పూర్తి ఏర్పాట్లను చేసింది.

ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ లాభం:
గత ఆర్థిక సంవత్సరంలో విధులు నిర్వహించిన 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు 32 శాతం వాటాగా కేటాయించిన రూ.711.18 కోట్ల రూపాయలను వారు పనిచేస్తున్న గని మరియు శాఖ ఆధారంగా లాభాల బోనస్ ను లెక్కించి చెల్లించనున్నారు. ప్రధానంగా ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో లాభాల బోనస్ దక్కనుంది.భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు 749.58 రూపాయల చొప్పున వారు పని చేసిన మొత్తం దినాలకు లెక్కగట్టి లాభాల బోనస్‌గా చెల్లిస్తారు. ఓపెన్ కాస్ట్ గనులు , ఇతర సర్ఫేస్ శాఖల్లో పనిచేసే వారికి రూ.627.41 చొప్పున చెల్లిస్తారు. వీరు కాక మిగిలిన విభాగాలు, శాఖల్లో పనిచేసే వారికి రోజుకు రూ.578.69 ల చొప్పున వారు పనిచేసిన దినాలకు లెక్క కట్టి బోనస్ చెల్లిస్తారు.మొత్తం మీద చూస్తే సగటున ఒక్కో కార్మికునికి రూ 1,53,516 వరకు లాభాల బోనస్ పొందే అవకాశం ఉంది.

తెలంగాణ వచ్చాకనే అత్యధిక టర్నోవర్ , లాభాలు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అందిస్తున్న సహకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశంలో సింగరేణి సంస్థ గత తొమ్మిదేళ్ల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది.సంస్థ ఛైర్మెన్ , ఎండి శ్రీ ఎన్.శ్రీధర్ సమర్థ సారథ్యం, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా తెలంగాణ రాకపూర్వంతో పోలిస్తే లాభాల్లో 421 శాతం వృద్ధినీ, అమ్మ కాలలో 176 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణ రాకపూర్వం 2013-14 లో రూ.11,928 కోట్ల టర్నోవర్ సాధించిన సింగరేణి, గత తొమ్మిదేళ్లలో ప్రతి ఏటా వృద్ధి చెందుతూ 2022-23లో రూ.33,065 కోట్ల రూపాయల టర్నోవర్ కు ఎదిగింది. అలాగే నాడు రూ.419 కోట్ల లాభాలను సాధించిన సంస్థ నేడు రూ.2222 కోట్ల రూపాయల లాభాల ను ఆర్జించగలిగింది.
త్వరలో దీపావళి బోనస్ కూడా..
ఇదిలా ఉంటే దీపావళి బోనస్ గా పేర్కొనే (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్ బోనస్ ను) కూడా ఆ పండుగకు ముందే చెల్లించనున్నట్లు ఛైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ప్రకటించారు. ఇది కూడా సుమారు 300 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో కార్మికుడికి గ్త ఏడాది చెల్లించిన 76,500 క్న్నా ఇంకా ఎక్కువ పొందే అవ్కాశాలు ఉన్నాయి.ఇటీవలనే చెల్లించిన 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ 1450 కోట్ల రూపాయ్ల్లో సగటున ఒక్కో కార్మికునికి 3.65 లక్ష రూపాయల వరకు అందాయి.ఈ విధంగా వేజ్ బోర్డు ఎరియర్స్ లాభాల బోనస్ , దీపావళి బోనస్ లు కలిపితే సగటున ప్రతి కార్మికుడి ఖాతాలో దాదాపు 6 లక్షల రూపాయల వరకు వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో తమ క్ష్టార్జితం చేతికంద్డం ఇదే ప్థ్మ్రం క్నుక దీనిని వృథా చేసుకోకుండా భవిష్యత్తు అవసరాలకు దాచుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
ఈ ఏడాది లక్ష్యాలు సాధిస్తే రూ.3500 కోట్ల లాభాలు సిఎండి: ఎన్.శ్రీధర్
బాగా పనిచేసిన కారణం గానే అద్భుతమైన వృద్ధి సాధ్యమైందని, కనుకనే సింగరేణి చరిత్రలో అత్యధిక శాతం లాభాల వాటాను కార్మికులు అందుకోగలిగారని సంస్థ ఛైర్మెన్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఈ ఏడాదికి నిర్దేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాను సాధించగలిగితే సింగరేణి సంస్థ గత ఏడాది కన్నా మిన్నగా రూ, 3500 కోట్ల లాభాలను సాధించే అవకాశం ఉందని, ఫలితంగా మరింత సంక్షేమం తో పాటు. ఇప్పటికన్నా ఎక్కువ లాభాల వాటా బోనస్‌ను పోందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కనుక ప్రతి కార్మికుడు తన పని గంటలను, యంత్రాల పనిగంటలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ఉత్పాదకత, ఉత్పత్తి పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News