నెలలో కిలోకు రూ.10 దాకా తగ్గుదల
రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం
న్యూఢిల్లీ: ముడి వంటనూనెలపై ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడంతో కొద్ది నెలల క్రితం వరకు వినియోగదారుల గుండెల్లో మంటలు మండించిన వంటనూనెల ధరలు గత నెల రోజుల్లో కిలోకు రూ. 8 -10 దాకా తగ్గాయని, దేశీయంగా చమురు గింజల ఉత్పత్తి గణనీయంగా పెరగనుండడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశీయంగా వంటనేనెల ధరలు రాబోయే రోజుల్లో కిలోకు మరో మూడు, నాలుగు రూపాయలు తగ్గే అవకాశముందని ఈ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెలు ముఖ్యంగా పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ధరలు అధికంగా ఉండడంతో గత కొద్ది నెలలుగా దేశంలో వినియోగదారులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఇఎ) అధ్యక్షుడు అతుల్ చతుర్వేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వీలయినంత మేరకు ధరలు తగ్గించాలని తమ అసోసియేషన్ సభ్యులకు దీపావళి ముందు సలహా ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా అదే సమయంలో వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించిదని తెలిపారు. ఫలితంగా గత నెల రోజులుగా వంట నూనెల ధరలు కిలోకు రూ.8 10 దాకా తగ్గాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు మరో మూడు, నాలుగు రూపాయలు తగ్గవచ్చని తాము అంచనా వేస్తున్నట్లు చతుర్వేది తెలిపారు. దేశంలో ఈ సీజన్లో సోయాబీన్ పంట భారీగా పెరిగే అవకాశం ఉందని, 120 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండవచ్చని, వేరు సెనగ పంట కూడా 80 లక్షల టన్నుల దాకా ఉండవచ్చని, ఫలితంగా వంటనూనెల ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అన్నిటికన్నా మించి ఈ సారి ఆవ పంట కూడా దాదాపు 30 శాతం ఎక్కువ విస్తార్ణంలో సాగు చేశారని, దీనివల్ల రాబోయే నెలల్లో ఆవనూనె ధరలు కూడా తగ్గవచ్చని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వంటనూనెల ధరలు తగ్గే అవకాశముందని తాము అంచనా వేస్తున్నట్లు చతుర్వేది తెలిపారు.