మరోసారి పొడిగించిన ఇంటర్ బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల గడువు ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత ప్రవేశాల గుడువు అక్టోబర్ 20వ తేదీతో ముగియగా, ఆ గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించారు. ఇంటర్ ప్రవేశాలలో ఈ సారి తొలిసారిగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్(ఇడబ్లూఎస్) కోటా అమలు చేస్తున్నారు. ఇంటర్ ప్రవేశాలలో ఎస్సిలకు 15 శాతం, ఎస్టిలకు 6 శాతం, బిసిలకు 29 శాతం, వికలాంగులకు 3 శాతం, ఎన్సిసి, స్పోర్ట్ కోటాకు 5 శాతం, ఎక్స్ సర్వీస్మెన్ కోటాకు 3 శాతం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్(ఇడబ్ల్యూఎస్) కోటాకు 10 శాతం సీట్లను కేటాయించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. అలాగే బాలికలకు మొత్తం సీట్లలో 33.33 శాతం సీట్లు కేటాయించాలని తెలిపింది.
పూర్తికాని జూనియర్ కాలేజీ అఫిలియేషన్ల ప్రక్రియ
రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించినట్లు తెలిసింది. ఈ ఏడాది మొత్తం 1,661 కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా,అందులో సుమారు 900 కళాశాలలకు అఫిలియేషన్లు జారీ చేసినట్లు సమాచారం. వీటితోపాటు వ్యాపార సముదాయ భవనాలలో ఉనన్న కళాశాలలు, విద్యాసంస్థలు ఉన్న భవనాలలో ఉన్న కళాశాలలు(మిక్స్డ్ ఆక్యుపెన్సీ) కళాశాలలు ఫైర్ ఎన్ఒసి, ఇతర పత్రాలు సమర్పించని కారణంగా అఫిలియేషన్లకు నిలిపివేసినట్లు తెలిసింది. ఈ కళాశాలల అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత అనుబంధ గుర్తింపు జారీ చేయనున్నారు.