కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్
గూటికి వెళుతున్నారంటూ పోలింగ్
సమయంలో ప్రచారం
సైబర్క్రైమ్లో టివి9 ప్రతినిధుల
ఫిర్యాదు, అసత్యవార్తలు ప్రసారం
చేయలేదని స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొందరు నకిలీ మీడియా ప్రతినిధులు టివి9 గ్రాఫిక్ ప్లేట్లతో నకిలీ ప్రచారానికి తెరలేపారు. దీంతో టివి9 పేరుతో నకిలీ వీడియోలతో సోషల్మీడియాలో ప్రచారం, ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టివి9 ప్రతినిధులు మంగళవారం నాడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమ్మకశ్యం కాని కల్పిత వార్తలతో వీడియోలు వైరల్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చెరుకు శ్రీనివాస్రెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరారంటూ దుష్ప్రచారం చేపట్టారు. ప్రముఖ చానల్ టివి9 ప్రసారం చేయని వార్తను సదరు చానల్లో ప్రసారం జరిగినట్లుగా ప్రచారం చేపట్టారు. ఈక్రమంలో టివి9 ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు కీలక ఆధారాలను అందించారు. టివి9 పేరిట అసత్య వార్తలను ప్రసారం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీంతో టివి9 ప్రతినిధులు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఓ ప్రముఖ టివి9 ఛానల్ లోగోతో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి సైతం స్పందించి తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారం వెనుక బిజెపి అభ్యర్థి రఘునందన్ హస్తం ఉందంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టివి9 ఛానల్ లోగోలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్త చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మరోవైపు ఆ వార్తతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ చానల్ పేరుతో ఫేక్ వార్తను సృష్టించి దుబ్బాక ఎన్నికను ప్రభావితం చేయాలనుకున్నారన్నారన్నారు. దీంతో అసత్య ప్రచారాలపై టివి9 యాజమాన్యం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దుష్ప్రచారానికి తెరతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు న్యూస్ చానెల్ ప్రకటించింది
10టివిని వదలని కేటుగాళ్లు
దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ సమయంలో 10tv పేరుతో నకిలీ వార్తలను సృష్టిచారు. 10tv లోగో, బ్రేకింగ్ ప్లేట్లను ఉపయోగించి రాజకీయ నకిలీ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈక్రమంలో సోషల్మీడియాలో ప్రసారం, ప్రచారం జరుగుతున్న వార్తలపై 10టివి ప్రతినిధులు సైతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10టివి ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు నకిలీ వార్తలను సృష్టించిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. నకిలీ వార్తలతో దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.