సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయసాగు విధానంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. సాగు లాభసాటిగా మారాలని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలనే కొత్త విధానం రావాలని ఆయన ఆకాంక్షించారు. పంటల సాగు విధానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అమల్లోకి తెస్తున్నారని హరీశ్ తెలిపారు. రైతుబంధు కింద 1.40లక్షల ఎకరాలకు రూ.14వేల కోట్లు ఇస్తామన్నారు. వానాకాలం పంట విషయంలో రూ.3,500 కోట్లు వ్యవసాయ శాఖ ఖాతాలో జమ చేశామని చెప్పారు. జిల్లాలో వానాకాలంలో 25 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా.. మద్దతు ధరకు సర్కార్ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.
వానా కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుందని తెలిపారు. మక్కల దిగుబడి వచ్చే సమయంలో వర్షం వస్తుందన్నారు. దిగుబడి వచ్చే సమయంలో వర్షాలు పడుతున్న క్రమంలో వేసవిలో మక్కలు వేసుకోవాలని చెప్పారు. ఈ ఏడాది సంగారెడ్డిలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని రైతులకు సూచించారు. రానున్న సంవత్సరం పత్తికి డిమాండ్ వస్తుందని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుందన్న మంత్రి… అందుకే పంటలను మార్చివేయాలని సూచించారు. నూతన వ్యవసాయ విధానంపై గ్రామస్థాయిలో రైతన్నలకు అవగాహన కల్పించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని అధికారులను మంత్రి హరీశ్ ఆదేశించారు.
Farmers Must Self-Respect Says Harish Rao