తేదీ నిర్ణయించాలని రైతుసంఘాలకు లేఖ
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు సాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ మళ్లీ చర్చలకు ఆహ్వానిస్తూ రైతు సంఘాల నేతలకు గురువారం లేఖ రాశారు. 40 రైతు సంఘాల నేతలకు రాసిన ఈ మూడు పేజీల లేఖలో రైతులకు ఆమోద యోగ్యమైన పరిష్కారం చూపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంటూ కొత్త చట్టాల పరిధిలో లేని కనీస మద్దతు ధరకు సంబంధించి కొత్త డిమాండ్ ఎజెండాలో చేర్చడం తార్కికం కాదని స్సష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి దాపరికం లేకుండా మంచి ఉద్దేశంతో ఆందోళన పరిష్కారానికి అన్ని అంశాలు చర్చిస్తుందని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పటిచర్చలకు తేదీ, సమయం నిర్ణయించాలని ఆయన లేఖలో సూచించారు.
ఇంతకు ముందు ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఐదు సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఢిల్లీ విజ్ఞానభవన్లో మంత్రి స్థాయిలో ఇప్పుడీ చర్చలు జరుగుతాయని, చర్చించాల్సిన ఇతర అంశాలపై వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పి) పై మాట్లాడుతూ కొత్త చట్టాలకు దీనికి సంబంధం లేదని, అలాగే పంట ప్రొక్యూర్మెంట్పై ధర నిర్ణయం పై కూడా దీని ప్రభావం ఉండదని, ఇదే విషయాన్ని ప్రతీ సారి స్పష్టం చేస్తున్నామని అగర్వాల్ చెప్పారు. ఎమ్ఎస్పిపై లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. 23న సంయుక్త కిసాన్ మోర్చా పంపిన లేఖకు స్పందనగా అగర్వాల్ ఇప్పుడీ లేఖ అందచేశారు. కిసాన్మోర్చా నిన్న పంపిన లేఖలో పభుత్వం నిర్మాణాత్మక ప్రతిపాదనలు లిఖిత పూర్వకంగా పంపితే తాము చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేయడం గమనార్హం.