Friday, April 26, 2024

నల్లగొండలో యాబై ఏళ్ల చెట్లకు పునరుజ్జీవనం

- Advertisement -
- Advertisement -

Fifty year old trees in Nalgonda

 

మన తెలంగాణ/నల్లగొండ: మరో బృహత్తర కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారం చుట్టింది. నల్లగొండ పట్టణంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణలో భాగంగా కోల్పోతున్న యాబై ఏళ్ల వయస్సు ఉన్న పెద్ద పెద్ద చెట్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు పునరుజ్జీవనం పోస్తున్నారు. నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి విజ్ఞప్తిని మన్నించి రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమాన్ని పూనుకున్నారు. మంగళవారం ఉదయం నల్లగొండ ఎంఎల్‌ఎ భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ కెవి. రమణాచారి, గ్రీన్ ఇండియా సభ్యులు, వాటా ఫౌండేషన్ సభ్యులు ఈ బృహత్ కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా గల 50ళ్ల వయస్సు కలిగిన వేప, చింత, రాగి, మర్రి చెట్లను వేర్లతో సహా పెకలించి , పెద్ద క్రేన్‌లు, పెద్ద ట్రక్కుల సహాయంతో చెట్లను తరలించారు. నల్లగొండ బైపాస్‌లోని చర్లపల్లి ఆర్బన్ పార్కులో ఈ చెట్లను తిరిగి నాటారు. వాటా ఫౌండేషన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్దతో ఈ చెట్లు మోడువారకుండా సైంటిఫిక్ పద్దతులను అనుసరించి చెట్లు తిరిగి జీవం పోసుకుని, చిగురించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్ల వెడల్పు వల్ల నల్లగొండ పట్టణంలో మొత్తం 200లకు పైగా చెట్లు తొలగిస్తున్నామని, వాటినన్నిటిని దశలవారిగా ఆగష్టు మాసంలోపు ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.

మొదటి దశలో 50 మొక్కలను ట్రాన్స్ లొకేషన్ చేసే ప్రక్రియ ఇవ్వాళ ప్రారంభించినట్టు ఆయన తెలియజేశారు. స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వాటా ఫౌండేషన్ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సైంటిఫిక్ పద్దతిలో 50ఏళ్ల వయస్సు ఉన్న చెట్లకు తిరిగి ప్రాణం పోయటం నిజంగా అద్భుతమని భూపాల్‌రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఈ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమంతో మరో మైలు రాయి చేరుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సంస్థల కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ కమీషనర్ రమణాచారి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ , మున్సిపల్ శాఖ అధికారులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు, వాటా ఫౌండేషన్ ప్రతినిధి మురళి, పలువురు ఎన్‌జివో ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News