కాబూల్: అఫ్ఘానిస్తాన్లో అధికారాన్ని గత నెల తాలిబన్లు చేజిక్కించుకున్నతర్వాత మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ వాణిజ్య విమానం సోమవారం కాబూల్ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లింది. తాలిబన్ల పాలనకు భయపడి దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్న పలువురు విదేశీయులు ఈ విమానంలో పయనమయ్యారు. అమెరికాకు చెందిన దాదాపు 1.20 లక్షల మంది సైనిక దళాలు హడావుడిగా నిష్క్రమించిన తర్వాత కాబూల్ విమానాశ్రయం మూతపడే స్థితికి చేరుకుంది. ఈ దశలో ఖతర్, ఇతర దేశాల సహకారంతో కాబూల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించుకున్న తాలిబన్లు మళ్లీ విమానాల రాకపోకలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కాబూల్ను చేరుకుని తిరిగి ఇస్లామాబాద్కు ప్రయాణికులతో బయల్దేరి వెళ్లింది. దాదాపు 70 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఇస్లామాబాద్ వెళ్లారు. వీరిలో చాలామంది ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు చెందిన బంధువులు. వీరంతా అఫ్ఘాన్ పౌరులే కావడం గమనార్హం. పరిస్థితి చక్కబడిన తర్వాత తాము తిరిగి అఫ్ఘాన్కు తిరిగివస్తామని వారిలో కొందరు తెలిపారు.