Sunday, May 12, 2024

రాష్ట్రానికి మరి మూడు దిగ్గజ కంపెనీలు

- Advertisement -
- Advertisement -

Fisker to set up IT Development Centre in Hyderabad

ఆర్ అండ్ డి, డిజిటెక్ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఫిస్కర్, కాల్‌వే
రూ.3,904కోట్లతో తన రెండవ అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్న క్వాల్కమ్
అమెరికా పర్యటనలో భాగంగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఐన ఫిస్కర్ హైదరాబాద్‌లో ఐటి, డిజిటల్ డెవలప్‌మెంట్ సెం టర్‌ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంత కాలం గా రాష్ట్ర ప్రభుత్వంతో ఇందుకోసం సంప్రదింపు లు జరుపుతున్న కంపెనీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. లాస్ ఏంజెల్స్‌లోని ఆ కం పెనీ ప్రధాన కార్యాలయంలో సిఇఒ హెన్రీక్ ఫిష్కర్, సియఫ్ వో గీతా ఫిస్కర్‌లతో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని ఫిస్కర్ ప్రతినిధులకు మంత్రి కెటిఆర్ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇవి పాలసీపై చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయన్నారు. ఇక జెడ్‌ఎఫ్, హ్యుం డై వంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ టెక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో కెటిఆర్ ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత రం గంగా గుర్తించిందన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆటోమొబైల్‌కి పరిశ్రమకు సంబంధించిన డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశాలున్నాయని ఈ సందర్భం గా కెటిఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిస్కర్ కంపెనీని కోరారు. కెటిఆర్ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వాములయ్యేందుకు వారు అంగీకరించారు. తమ ఐటి,డిజిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రపంచంలోని అనేక దేశాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలను కూడా పరిశీలించామని, అయితే తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత, ప్రభుత్వ పారదర్శక విధానాలే హైదరాబాదులో సెంటర్ ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆ సంస్థ సిఇఓ హెన్రీక్ ఫిష్కర్ చెప్పారు. ఈ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుతో ఆటో మొబైల్, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించి, మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా తమ పరిశోధన, ఇంజనీరింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం కెటిఆర్‌కు అందజేశారు. ఫిష్కర్ కంపెనీ తయారు చేసిన ఓషన్ మోడల్ ఎలక్ట్రిక్ కారును మంత్రి కెటిఆర్ పరిశీలించారు.

డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న కాల్‌అవే గోల్ఫ్ కంపెనీ

గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ కాల్‌అవే సంస్థ హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ బ్రాండ్స్ ఒడిసి, ట్రవిస్ మాథ్యూ, ఓజియో, జాక్ వోల్ఫ్ స్కిన్ లను కలిగి ఉన్న కాల్‌అవే వార్షికాదాయం 3.2 బిలియన్ డాలర్లు. ఈ డిజిటెక్ సెంటర్‌తో గోల్ఫ్ క్రీడకు సంబందించిన డేటా అనలిటిక్స్ తో పాటు తన గ్లోబల్ కార్యకలాపాలకు సపోర్టును, టెక్ సొల్యూషన్స్‌ను అందించేందుకు ఈ డిజిటెక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ డిజిటెక్ సెంటర్‌తో గోల్ఫ్ ఆటగాళ్ల ఆటతీరుతో సహా వారి క్రీడా నైపుణ్యం, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయానికి సంబంధించి ఎదురయ్యే అనేక సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను తమ కంపెనీ సూచిస్తుందని తెలిపింది. లాస్ ఏంజలెస్‌కి దగ్గరలో ఉన్న కాల్స్ బాద్ నగరంలో మంత్రి కెటిఆర్, కాల్‌వే కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, సిఎఫ్‌వో బ్రయన్ లించ్, సిఐవో సాయి కూరపాటి లతో సమావేశం అయ్యారు. అమెరికా తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటుచేయబోయే సెంటరే అతి పెద్దదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. డిజిటెక్ సెంటర్ ఏర్పాటుతో తొలి దశలో అత్యంత నైపుణ్యం కలిగిన 300 మంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు ఉపాధి దొరుకుతుందన్నారు. పెట్టుబడికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తామని కాల్‌అవే ప్రతినిధులు ప్రకటించారు.

కాగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లతో పాటు ఐటి,టెక్ కేంద్రాలను అనేక కంపెనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన మంత్రి కెటిఆర్… గోల్ఫ్ క్రీడ ఆధారిత వినూత్న టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం పట్ల కంపెనీ కి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫార్మా, ఐటి రంగాల టెక్నాలజీ సెంటర్ లు హైదరాబాదులో ఉన్నాయన్నారు. కాల్‌అవే కంపెనీ ప్రకటన తర్వాత అనేక ఇతర క్రీడలకు సంబంధించిన టెక్నాలజీ సెంటర్ లు హైదరాబాద్‌లో ఏర్పాటు అవుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా టూరిజం, క్రీడా అగ్రి తయారీ వంటి అంశాలపై కూడా చర్చించారు. ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను పరిశీలించిన తర్వాత హైదరాబాద్ లో తమ కంపెనీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు కెటిఆర్‌కు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మరియు చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం తదితరులు పాల్గొన్నారు.

రెండో అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలో ప్రారంభించనున్న క్వాల్కమ్ సంస్థ

సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శాండియాగోలోని క్వాల్కమ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సిఎఫ్‌ఒ ఆకాష్ పాల్కివాల, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్, లక్ష్మి రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్ సింగ్ వంటి సీనియర్ ప్రతినిధి బృందం మంత్రి కెటిఆర్‌తో సమావేశమైంది.

హైదరాబాద్ నగరంలో వివిధ దశల్లో రూ.3904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపిన క్వాల్కమ్, మంత్రి కెటిఆర్ తన పెట్టుబడి ప్రణాళికలను పంచుకుంది. నగరంలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రభుత్వ పాలసీలు తమ కంపెనీని నిరంతరం తెలంగాణలో విస్తరించేలా ప్రభావితం చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపింది.
రానున్న ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ లో భారీగా పెట్టుబడి పెడతామన్న క్వాల్కమ్ సంస్థ, తమ విస్తరణతో 8700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు సుమారు 15 లక్షల 72 వేల ఎస్‌ఎఫ్‌టి కార్యాలయం అందుబాటులోకి వస్తుందందని తెలిపింది. పెట్టుబడికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నెల నాటికి హైదరాబాద్ లో తమ కేంద్రం రెడీ అవుతుందని క్వాల్కమ్ తెలిపింది.

ఇప్పటికే టెక్ దిగ్గజాలు హైదరాబాదులో ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ క్యాంపస్ అని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపిన కెటిఆర్… ఈ వరుసలో క్వాల్కమ్ సంస్థ చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంత భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ తయారీ వంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్ సంస్థ పెట్టుబడి ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. సాఫ్ట్ వేర్ తో పాటు వ్యవసాయ, విద్యా రంగాల్లో తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కు వివరించారు. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్‌ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మంత్రికి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News