ఎఫ్డిఐ నిబంధనలు కఠినతరం
భారత కంపెనీల్లో పొరుగు దేశాలు వాటాలు చేజిక్కించుకోకుండా కీలక నిర్ణయం
పెట్టుబడులకు ఇక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత కంపెనీలో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్లో సరిహద్ద్దులు పంచుకొ నే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కంపెనీ ల్లో పెట్టుబడులు పెట్టడం ఒకటి (ఆటోమేటిక్). ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టడం రెండోది. ఇప్పటివరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెండో విభాగంలో ఉండేవి. ప్రస్తుత నిబంధనలతో చైనాతో పాటుగా సరిహద్దులను పంచుకునే దేశాలైన అఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, నేపాల్లను రెండో విభాగంలో చేర్చారు.
చైనాలోని వు హాన్లో పుట్టిన కరోనా వైరస్తో ప్రపంచమంతా బాధపడుతోంది. లాక్డౌన్, ఆంక్షలు అమలు చేయడంతో అన్ని దేశాల్లో ఆర్థిక సమస్యలు దెబ్బతిన్నాయి. ఇదే అదనుగా అవకాశవాదంతో భారత కంపెనీలను చేజిక్కించుకోకుండా, విలీనాలు జరక్కుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసిందే. అమెరికాకు చెందిన కొన్ని కంపెనీల్లోనూ చైనా వాటాలు కొనుగోలు చేసిందని సమాచారం!‘భారత్లో సరిహద్దులు పంచుకొనే దేశాల్లోని కంపెనీ లేదా యజమాని లేదా పౌరుడు స్థానిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి’ అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రక్షణ, టెలికాం, ఫార్మా సహా 17 రంగాల కంపెనీల్లోని నిర్దేశిత శాతాన్ని మించి విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రూ.5000 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాలంటే ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు తీసుకురావాలి.