Monday, May 6, 2024

కొత్తగా స్వయం సహాయక బృందాల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : కొత్త సభ్యులతో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరుపై బిఆర్‌కెఆర్ భవన్‌లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6,06,000 స్వయం సహాయక బృందాలలో 64 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 4,30,785 బృందాలలో 46 లక్షలకుపైగా సభ్యులుండగా, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 1,76,623 బృందాలలో దాదాపు 18 లక్షల మంది సభ్యులున్నారని వెల్లడించారు.

గ్రామాలు, పట్టణాలలో గ్రూపుల్లో చేరని సభ్యులను గుర్తించి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌హెచ్‌జి గ్రూపులు, సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో అప్-డేట్ చేయాలని, అనంతరం గ్రూపుల్లోని సభ్యులందరికీ క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయాలని సిఎస్ ఆదేశించారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పొందుతున్న వడ్డీ లేని రుణాల మొత్తాలను ఉత్పాదక రంగాలలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు.

స్వయం సహాయక బృందాల సభ్యులకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా వారి ఆదాయ మార్గాలను పెంపొందించేందు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఐటి,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ శృతి ఓఝా, సెర్ప్ డైరెక్టర్ వై.ఎన్. రెడ్డి, శ్రీనిధి ఎండి విద్యాసాగర్, అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News