ఇంకా రూ.722 కోట్లు అవసరం
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు పథకానికి రూ.333.29 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి శుక్రవారం పరిపాలన అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రైతుబంధు పథకం కోసం జనవరి నెలలో రూ.5100 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో రబీ రైతుబంధుకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.5433 కోట్లు విడుదల చేసింది. ఈ రబీలో మొత్తం 47.50 లక్షల మంది రైతులకు 1.23 కోట్ల ఎకరాలకు ఒక్క ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సొమ్మును జమ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
ఇందుకోసం మొత్తం రూ.6155 కోట్లు అవసరం. అయితే ఇందులో 42.42 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.4406 కోట్లకు వ్యవసాయ శాఖ బిల్లులు పెట్టింది. ఇందులో 40.26 లక్షల మంది రైతులకు రూ. 3925 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేసింది. ఇంకా రూ.480 కోట్లకు సంబంధించిన బిల్లులు ఆర్థిక శాఖ నుంచి క్లియర్ కావాల్సి ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే ప్రభుత్వం నుంచి రూ.722 కోట్లు విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నాయి.