మనతెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైల పుణ్యక్షేత్రంలోని ఘంటామఠంలో ఆదివారం నాడు నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వాయువ్య భాగంలో ఉన్న ఘంటామఠం పునర్నిర్మాణ పనులు చేస్తుండగా నీటి కోనేరు రాతి పొరల మధ్య 2 డబ్బాలు బయటపడ్డాయి. వాటిని తెరచి చూడగా 15 బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగరం, 18 వెండి నాణేలు ఉన్నట్లు దేవస్థానం ఇవొ రామారావు తెలిపారు. ఈక్రమంలో తహసీల్దార్ రాజేంద్ర సింగ్, సిఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకొని బంగారు నాణేలకు పంచనామా నిర్వహించారు.
ప్రాచీన కాలానికి చెందిన పంచ మఠాల్లో ఒకటైన ఘంటా మఠం విశేషమైనది. మూడేళ్ల క్రితం ఇక్కడ నిర్మాణాలు చేస్తుండగా బంగారు నాణేలు బయటపడ్డాయి. పది రోజుల క్రితం 245 వెండి నాణేలు బయటపడ్డాయి. అయితే బంగారు నాణేలు బ్రిటిష్ కాలం నాటివని ఆలయ ఇవొ రామారావు స్పష్టం చేశారు. ఒక నాణెంపై చార్మినార్ బొమ్మ ఉందన్నారు. నాణేలు 1880 నుంచి 1910 మధ్య కాలంలో వాడుకలో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించామని తెలిపారు.