కోల్కత: పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించి రాజకీయనేతలు, అధికారులు, జర్నలిస్టులపై గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఇద్దరు సభ్యుల విచారణ కమిషన్ను నియమిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన నేడు జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తులు సభ్యులుగా విచారణ కమిషన్ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ పెగాసస్ స్పైవేర్ గూఢచర్యంపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ కమిషన్ను కేంద్రం నియమిస్తుందని తాము భావించామని, అయితే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో దీని అంతు తేల్చేందుకు విచారణ కమిషన్ నియమించాలని తామే నిర్ణయించుకున్నామని చెప్పారు.
కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీమ్రావు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించినట్లు ఆమె తెఇపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురి పేర్లు పెగాసస్ హిట్లిస్టులో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ చట్టవిరుద్ధ ఫోన్ హ్యాకింగ్ గురించి విచారణ కమిషన్ వాస్తవాలు తేలుస్తుందని మమత స్పష్టం చేశారు.