Monday, April 29, 2024

రైతుల చెంతకు సర్కారీ రైస్ మిల్లులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతాంగాన్ని తమ ఉత్పత్తులను విశ్వ విఫణిలో విక్రయించి మరిన్ని లాభాలు ఆర్జించే స్థాయికి చేరుస్తామనీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ దిశగా, వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచ ప్రఖ్యాత రైస్ మిల్ కంపెనీ జపాన్ కు చెందిన సటేక్ కార్పోరేషన్ ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో సిఎం కెసిఆర్ చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, సిఎస్ శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి గణనీయం గా పెరిగి, దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుం డా, వారు పండించిన పంటకు లాభాలను ఆర్జించి పెట్టే మార్కెటింగ్ విధానాలను అమలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతాంగానికి ప్రభుత్వం శుభవార్తను అందించింది. రైతుల కష్టాలను తొలిగించేందుకు ఇప్పటికే వారికి అందుబాటులోకి పంట కొనుగోలు కేంద్రాలను తెచ్చిన రాష్ట్రం, పండిన పంటకు లాభాలార్జించి పెట్టేందుకు రైస్ మిల్లులు వంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను మరిన్నింటిని అందుబాటులోకి తేనున్నది. ఈ నేపథ్యంలో సిఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రోత్సాహించాలనే విధానంలో భాగంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం, నిర్వహించడం.. భవిష్యత్ లో విశ్వ విపణిలో వరి ధాన్యం నుండి తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ను అనుసరించి మార్కెట్ ను విస్తరించే బాధ్యత కూడా కార్పోరేషన్ చేపట్టడం,.వంటి కీలక నిర్ణయాలను నేటి ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్నారు. తద్వారా రాష్ట్రంలో పండే వరి పంటను మార్కెట్ చేయడం ద్వారా రైతులను షావుకారులుగా మార్చే బృహత్ కార్యాన్ని సివిల్ సప్లైస్ శాఖ చేపట్టనున్న ది.

ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానం గా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆయిల్ కు ప్రపంచ మార్కె ట్‌లో విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రైతు పండించిన ధాన్యానికి మార్కెట్ లో మరింత ఆదరణ పెరుగనున్నది. అదే సందర్భంగా రోజు రోజుకూ పెరుగుతున్న ధాన్యపు నిల్వల కోసం మరిన్ని గోదాములను ఈ మిల్లులకు అనుసంధానంగా నిర్మిస్తారు. ఇంకా రైతులకు మేలు జరిగే దిశగా, ఇందుకు సంబంధించి మరిన్ని నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి, అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. రైస్ మిల్లుల స్థాపన నేపథ్యంలో సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లో మరిన్ని బాధ్యతలను చేపట్టే విధంగా అధికారులను, సిబ్బందిని పెంచుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘వ్యవసాయం పండుగ చేయాలనే దార్శనికతతో సాగునీరు, విద్యుత్తు, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి అంశాలను ప్రాధాన్యతాంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రైతుబంధు, రైతు బీమా వంటి రైతు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ఉచిత విద్యుత్తును, సాగునీటిని అందిస్తూ, సబ్సిడీలిస్తూ రైతులను పంటలు పండించేందుకు సంపూ ర్ణ మద్దతును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది.

ఇటువంటి పరిస్థితుల్లో ఏ కారణం చేతనైనా పండిన పంట వ్యర్థం కాకుండా, తరుగు లేకుండా, రైతులకు ధర తగ్గడం వంటి నష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నది. రైతు పంటకు ఓపెన్ మార్కెట్ రేట్ ధర పలికేలా చేయడానికి వరి ధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చే దిశగా జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందు లో భాగంగా ప్రతి జిల్లాలో గంటకు 60 టన్నులు, 120 టన్నులు బియ్యాన్ని ఆడించే అత్యంత ఆధునిక, సాంకేతికతో కూడిన రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నాం’ అని సిఎం కెసిఆర్ వివరించారు. ‘గడిచిన 9 ఏళ్ళుగా ఎన్ని కష్టాలనైనా అధిగమిస్తూ, అమలు చేసిన కార్యాచరణ విప్లవాత్మక ఫలితాలను అందిస్తున్నదన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాలను వెనక్కు నెట్టి నేడు రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి 3 కోట్లకు పైగా టన్నులకు చేరుకోవడం వెనుక ఎంతో కృషి దాగి ఉన్నదని తెలిపారు. ఇప్పటికే ఇంత ఘనమైన ఉత్పత్తిని సాధించిన తెలంగాణ మరికొద్ది రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు ఎత్తిపోతల, నల్గొండ జిల్లా బ్రాహ్మణవెల్లెంల, డిండి, సిద్దిపేటలోని గౌరవవెల్లి, ఖమ్మం జిల్లా సీతారామ, సిరిసిల్ల మల్కపేట, అచ్చంపేట ఉమామహేశ్వర వంటి ప్రాజెక్టులు పూర్తికానున్నాయన్నారు. అప్పుడు వరి ధాన్యం దిగుబడి రాష్ట్రంలో మరింతగా పెరుగనున్నదని తెలిపారు.

అంచనాలకు మించి పెరుగుతున్న వరి ధాన్యపు మిల్లింగ్ సామర్థ్యాన్ని తదనుగుణంగా పెంచుకోవాల్సి ఉన్నదన్నారు. ప్రస్తుతం సిఎంఆర్ మిల్లింగ్ ద్వారా రాష్ట్రంలో వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చే రైస్ మిల్లుల కెపాసిటి 75 లక్షల టన్నులకు మించి లేదన్నారు. దాంతో తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యం మిల్లు ల్లో నిల్వలు పెరుకుపోతున్నాయని తెలిపారు. అధిక నిల్వలతో తరువాత పంటకు నిల్వ స్థానం లేకుండా పోతున్నదన్నారు. ధాన్యాన్ని మిల్లాడించే పరిస్థితి డిమా ండ్‌కు తగ్గట్టు లేకపోవడం, పండిన పంటకు, రైస్ మిల్లుల సామర్థ్యానికి విపరీతమైన వ్యత్యాసం ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల నుండి రైతును గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్ రావు,గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సిఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండు వేల కోట్లకు పైగా ఖర్చు కాను న్న ఈ బృహత్ కార్యానికి ముఖ్య మంత్రి కెసిఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News