న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ లక్షం పూర్తవుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రభుత్వ సంస్థలలో గత ఏడాది మార్చి 1 నాటికి ఉద్యోగుల సంఖ్య 32,62,908, ఇది వచ్చే ఏడాది మార్చి నాటికి 35,25,388కు చేరుతుందని బడ్జెట్ పత్రాలలో తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు శూన్యమని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన విపరీత పరిణామాలతో ఉన్న ఉద్యోగాలు పొయ్యాయని, కొత్తవి రానేలేదని విమర్శలు వెల్లువెత్తాయి.
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో వచ్చే ఏడాది మార్చి 1లోగా భర్తీ అయ్యే ఉద్యోగాల సంఖ్యను వేరువేరుగా తెలియచేశారు. విధాన రూపకల్పన విభాగంలో అత్యధికంగా 79,353 ఉద్యోగాలు వస్తాయి. రక్షణ మంత్రిత్వశాఖ పౌర విభాగంలో 22,045 ఉద్యోగాలు కల్పిస్తారు. హోం మంత్రిత్వశాఖలో అదనంగా 8200 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హోంశాఖకు సంబంధించి కేబినెట్, పోలీసు బలగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లెక్కలోకి వస్తాయి. స్పేస్లో 3903, రెవెన్యూలో 3243 ఉద్యోగాలు వస్తాయి. వీటితో ఈ శాఖలో ఉద్యోగాల సంఖ్య 26,564కు చేరుతుంది.
సాంస్కృతిక శాఖలో అదనంగా 3886, ఎర్త్ సైన్సెస్లో 2581, విదేశాంగ శాఖలో 2167, పర్యావరణ మంత్రిత్వశాఖ , అడవులు, వాతావరణ మార్పుల శాఖలో 2136, ఎలక్ట్రానిక్స్, ఐటిలో 1347 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అణు ఇంధన విభాగం శ్రామికశక్తిలో 2300 మంది అదనంగా చేరుతారం. వ్యవసాయ విభాగం, సహకార, రైతాంగ సంక్షేమాలలో మొత్తం 1766 కొత్త ఉద్యోగాలు వస్తాయి.
ఆరోగ్యం, విద్య సముచిత ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో మూడు ప్రధాన ఇతివృత్తాలకు ప్రాధాన్యతను ఇచ్చిందని ఆర్థిక మంత్రి తెలియచేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకునే బడ్జెట్ను అల్లినట్లు తెలిపారు. ఆక్షాంక్ష భారత్ తమ ఏకైక విధానం అన్నారు. అన్ని వర్గాల ఆశలకు రూపకల్పననే కీలకమని, అందరి జీవన ప్రమాణాలను పెంచేందుకు వీలుగా ఆరోగ్యం, విద్య, సముచిత ఉద్యోగాల ప్రాతిపదికన ఈ బడ్జెట్ను రూపొందించినట్లు వివరించారు.
Govt to create over Rs 26 lakh jobs